వైజయంతీ మూవీస్ పూర్వ వైభవంతో కళకళలాడుతోంది. ఎవడే సుబ్రహ్మణ్యంతో ఓ హిట్టుకొట్టిన ఆ సంస్థ… ఇప్పుడు మహానటితో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన ఖ్యాతి దక్కించుకుంది. నాగార్జున – నానిల మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న వైజయంతీ మూవీస్ ఇప్పుడు ఎన్టీఆర్తో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు అగ్ర దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చే పనిలో పడింది. అందులో భాగంగా విక్రమ్ కె.కుమార్కి కూడా వైజయంతీ అడ్వాన్సులు అందించినట్టు సమాచారం. 13బి, మనం లాంటి సూపర్ హిట్లతో విక్రమ్ కె.కుమార్ తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. అయితే అతన్నుంచి వచ్చిన `హలో` బాగా నిరాశ పరిచింది. నానితో ఓ సినిమా అనుకున్నారు గానీ, అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు వైజయంతీ కోసం ఓ కథ రెడీ చేస్తున్నారు విక్రమ్. అది ఎన్టీఆర్ కోసమా, లేదంటే మరో కథానాయకుడి కోసమా..? అనేది మాత్రం తెలియాల్సివుంది. ఇక మీదట వైజయంతీ మూవీస్ మాత్రం ఇది వరకటిలా వరుసగా సినిమాలు చేస్తుందన్నమాట. ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఫామ్లోకి రావడం, చిత్ర నిర్మాణం ముమ్మరం చేయడం.. పరిశ్రమలో ఆహ్వానించదగిన పరిణామం.