తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. నేతల వైఖరితో అధిష్టానం జాప్యం చేస్తూనే ఉంది. రోజులు గడిచేకొద్ది ఆశవాహుల లిస్టు కూడా పెరుగుతోంది. అనూహ్యంగా ఎమ్మెల్సీ రేసులోకి వచ్చి పదవిని చేజిక్కించుకున్న విజయశాంతి ఇప్పుడు తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిశారు.
దాదాపు పదిహేను నిమిషాలపాటు మీనాక్షితో విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో తనకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే , ఇన్నాళ్లుగా కేబినెట్ విస్తరణపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా విజయశాంతి పేరు అధిష్టానం పరిశీలనలో కూడా లేదు. కానీ ఆమె ఇప్పుడు తనకు పదవి కావాలని కోరడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. వారిలో కొండా సురేఖ పదవి డేంజర్ లో ఉందన్న వార్తలు వినిపించాయి. ఆమె కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతే. కొండా సురేఖకు ఉద్వాసన పలికితే తనకు అవకాశం ఇస్తారని అంచనాతోనే విజయశాంతి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
పైగా..ఇటీవల ప్రకటించిన కమిటీలో ఎందులోనూ తన పేరు లేదంటే మరో దాంట్లో అవకాశం ఇస్తారేమోనని రాములమ్మ వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.