అమరావతిని కేవలం ఒక రాజధానిగా మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి క్వాంటం వ్యాలీగా మారుస్తామని చంద్రబాబు ధీమా ప్రకటించారు. వేల మంది విద్యార్థులతో ఆన్ లైన్లో క్వాంటమ్ టాక్ నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ ద్వారా ఏపీలో సాఫ్ట్వేర్ విప్లవాన్ని ప్రారంభించినట్లుగానే, ఇప్పుడు అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ కేంద్రంగా రూపొందిస్తామని విద్యార్థులకు వివరించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, భారతదేశానికి క్వాంటం వ్యాలీగా అమరావతి నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
భారతీయులకు నైపుణ్యం అనేది రక్తం లోనే ఉందన్నారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే అర్బన్ ప్లానింగ్ చేసిన చరిత్ర మనదని, ఆయుర్వేదం, తక్షశిల, నలంద వంటి విద్యాలయాలతో ప్రపంచానికి మనం దిక్సూచిగా నిలిచామని గుర్తు చేశారు. గణితంలో సున్నా ఆవిష్కరణ నుంచి నేటి గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వరకు భారతీయుల నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
భవిష్యత్తు అంతా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ , డ్రోన్ టెక్నాలజీలదేనని అవకాశాలను అంది పుచ్చుకోవాలని సీఎం యువతకు పిలుపునిచ్చారు. నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా కేంద్రం ఇస్తున్న సహకారంతో వైద్యం, విద్యుత్, వ్యవసాయం మరియు వాతావరణ అంచనా వంటి రంగాల్లో పరిశోధనలు చేయాలని సూచించారు. అతి తక్కువ వ్యయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని, పరిశోధనలకు ఆకాశమే హద్దుగా యువత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయని భవిష్యత్ లో నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా ఉంటుందన్నారు. తిరుపతిలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


