పరిశ్రమకు కష్టం వస్తే చిరంజీవి దగ్గరకు పరిగెడతారు. ముఖ్యమంత్రుల్ని కలవడానికి వెళ్తే ఆయన్నే వెంట బెట్టుకొని వెళ్తారు. కరోనా టైమ్లో సీసీసీ పేరుతో కార్మికులకు నిత్యావసరాలు అందించే బాధ్యత చిరు తనకు తానుగా నెత్తిమీద వేసుకొన్నారు. టికెట్ రేట్ల గురించి మాట్లాడాలన్నా ఆయనే. ఎన్ని చేసినా, ఎన్ని చేస్తున్నా చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగా కొంతమంది చూడలేకపోతున్నారు. అలాంటి వారిలో తమ్మారెడ్డి భరద్వాజా ఒకరు. తమ్మారెడ్డి లేటెస్ట్ స్టేట్ మెంట్లు చూస్తే చిరంజీవిపై ఆయన వైఖరేంటో అర్థమైపోతుంది ‘చిరంజీవినిఇండస్ట్రీ పెద్దగా అనలేమని, దాసరి తరవాత ఆ స్థానం అలానే ఉండిపోయిందని, ఆ ప్లేస్ మరెవ్వరూ భర్తీ చేయలేరని, ఆ పెద్ద రికం రాదని’ ఓ ఇంటర్వ్యూలో నిర్మొహమాటంగా చెప్పేశారు తమ్మారెడ్డి.
నిజమే.. ఒకప్పుడు దాసరి హవా ఆ స్థాయిలో ఉండేది. నిర్మాతలు, కార్మికులు, మీడియా, నటీనటులు ఇలా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆయన గుమ్మం తొక్కేవారు. పెద్ద మనిషి తరహాలో దాసరి సెటిల్మెంట్లు చేసేవారు. దాసరి దగ్గరకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించేవాళ్లు. దాసరి ఇంట్లో అదే జరిగేది కూడా. అయితే దాసరి తరవాత… ఆ బాధ్యత తాను తీసుకొన్నారు చిరు. ఆయన దగ్గరకు వెళ్లిన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి అని చెప్పలేం కానీ, చిరు తన వంతు చేశారు, చేస్తున్నారు. అయినా పెద్దరికం అనేది పదవి కాదు. అధికారం కూడా కాదు. అదో బాధ్యత అంతే. దానికో స్టేటస్ కావాలి. అది చిరంజీవికి తప్ప ఎవరి ఉంది?
‘నన్ను పరిశ్రమలో ఒకడిగా చూడండి చాలు.. పరిశ్రమ పెద్దగా చూడక్కర్లెద్దు` అని చిరంజీవి చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన కూడా ‘పెద్దిరికం’ మీద వేసుకోవాలని చూసేరకం కాదు. కానీ.. ఇండస్ట్రీకంటూ ఓ ముఖ చిత్రం ఉండాలంటే చిరుని మించిన వ్యక్తి లేడు. ఈ విషయాన్ని తమ్మారెడ్డి వాళ్లు గుర్తు పెట్టుకోవాలి. ఆయన చెప్పినట్టు చిరంజీవి ని పెద్దగా చూడలేం అనుకొందాం. మరి ఆ స్థానం ఎవరికి ఇస్తారు? ఇండస్ట్రీకి గానీ, ఇక్కడున్న వ్యవస్థల మధ్య గానీ బేదాభిప్రాయాలు వస్తే వాటి గురించి మాట్లాడేవాళ్లు ఎవరున్నారు? ఆ పెద్దరికం తనకు తానుగా తమ్మారెడ్డి తీసుకోగలరా, లేదంటే మరో హీరో పేరు చెప్పగలరా? ఆయన ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా.. దాసరి తరవాతి స్థానం కచ్చితంగా మెగాస్టార్ దే. రేప్పొద్దుట తమ్మారెడ్డికే సమస్య వచ్చినా, ఆయన వెళ్లేది కూడా చిరు దగ్గరకే. ఈ విషయం ఆయనకే అర్థం కావడం లేదు.
