తెలుగు కథానాయకులు తమిళ మార్కెట్పై దృష్టి పెట్టారు. తెలుగు, తమిళం.. ఇలా ఒకేసారి రెండు భాషల్లోనూ సినిమాలు చేసి.. ఒకే సినిమాతో రెండు మార్కెట్లనీ పట్టేద్దామని ప్లాన్ వేశారు. అలా జరగాలంటే.. తమిళ దర్శకులతో ఓ తెలుగు సినిమా చేయడం ఉత్తమమార్గం. ప్రస్తుతం మహేష్ బాబు, అల్లు అర్జున్లు అదే చేస్తున్నారు. మురుగదాస్ తో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. లింగుస్వామి కథకు బన్నీ ఓకే చెప్పాడు. ఇవి రెండూ ద్విభాషా చిత్రాలే. ఇప్పుడు అల్లు శిరీష్కూడా అదే ప్లాన్ వేశాడు. శ్రీరస్తు – శుభమస్తుతో కాస్త ఉపశమనం పొందాడు శిరీష్. ఇదే జోష్తో మరో హిట్టు కొట్టి.. అందరి దృష్టి తనవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాడు. పనిలో పనిగా తమిళ ప్రేక్షకుల్నీ ఆకట్టుకోవాలన్న ధ్యేయంతో ఉన్నాడు.
అందులో భాగంగా తమిళ దర్శకుడు సుశీంద్రన్తో శిరీష్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. నా పేరు శివలాంటి సినిమాతో ఆకట్టుకొన్నాడు సుశీంద్రన్. పక్కా నేటివిటీతో, సహజమైన కథలతో ఆకట్టుకొనే దర్శకుడు సుశీంద్రన్. బడా హీరోలు సైతం సుశీంద్రన్తో కలసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి దశలో శిరీష్కి కలసి ఓ కథ చెప్పాడట సుశీంద్రన్. అది విన్న శిరీష్.. ఫ్లాటైపోయినట్టు టాక్. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో గీతా ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఓకే అయి పట్టాలెక్కితే గనుక.. శిరీష్ తమిళ ఇన్నింగ్స్కి కొబ్బరికాయ్ కొట్టేసినట్టే.