అలనాటి మహానటి సావిత్రి జీవిత గాథని తెరకెక్కించడానికి అశ్వనీదత్ రంగం సిద్దం చేసుకొన్నారు. అల్లుడు నాగ్ అశ్విన్ సావిత్రి జీవిత కథని ‘మహానటి’ పేరుతో స్ర్కిప్ట్ రూపంలోకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలకు ఎన్టీఆర్, నాగచైతన్యలను సంప్రదించి ఈ సినిమాని ఓ మల్టీస్టారర్ లుక్ తీసుకొచ్చారు. అయితే సంబడం ఇక్కడితో అయిపోలేదు. ఈ సినిమాకి ఇంకా చాలా చాలా సమస్యలున్నాయి. ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, ఎమ్జీఆర్, శివాజీ గణేశన్ పాత్రలు ‘మహానటి’ కథలో కీలకంగా మారాయి. మరీ ముఖ్యంగా ఎస్వీ రంగారావుది ఓ ఫుల్ లెంగ్త్ ఎపిసోడ్ ఉందట. మరి ఆయా పాత్రలకు ఎవర్ని తీసుకోవాలో తెలీక చిత్ర బృందం సతమతమవుతోంది. ఎమ్జీఆర్, శివాజీగణేశన్ పాత్రధారులు ఈజీగానే దొరికేస్తారేమో. మరి ఎస్వీఆర్, సూరేకాంతం మాటేమిటి? ఆ స్థాయి ఈనాటి నటుల్లో ఎవరికి ఉంది? ఎస్వీఆర్ పాత్రని పోషించే సమర్థత ఎవ్వరిలోనూ కనిపించడం లేదు. సూర్య కాంతం లుక్స్ కూడా ఎవ్వరిలోనూ లేవు. దాంతో ఆయా పాత్రల్ని ఎలా తయారు చేయాలా అనే సందిగ్థంలో పడ్డాడట అశ్వనీదత్.
స్క్రిప్టు పరంగా అయితే పూర్తి సంతృప్తిలో ఉన్నాడు అశ్వనీదత్. ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ సుమారు యేడాది నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. సావిత్రి సంబంధీకుల్ని వెదికి పట్టుకొని, సావిత్రి జీవితంలో ఇప్పటి వరకూ వెలుగులోకి రాని కోణాల్ని ఈ సినిమా ద్వారా బయటపెట్టబోతున్నాడట. కథలోని కొన్ని పాయింట్లు నచ్చి నిత్యమీనన్ ఈ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేసిందని, స్ర్కిప్టు చదివి స్పెల్ బౌండ్ అయిపోయిందని చెబుతున్నారు. ఎస్వీఆర్, సూరేకాంతంలు దొరికేస్తే.. సావిత్రి సినిమా పట్టాలెక్కేసినట్టే.