వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన రెండవ సారి ఎన్నికలకు వెళ్లే ముందు జగన్ సాక్షి ప్రారంభించారు. మీ చేతులమీదుగా ప్రారంభించండని ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. మా వాళ్లతో మాట్లాడతానని చెప్పిన చంద్రబాబు ‘ మాకు కొన్ని చిక్కులున్నాయి’ అని జవాబు చెప్పేశారు. ఆ రోజు ప్రారంభానికి వెళ్లలేదు గాని ఆ పత్రికకు ప్రచారం కల్పించడంలో మాత్రం ఒక బ్రాండ్ అంబాసిడర్ను మించి పనిచేస్తున్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా సాక్షి పేరు తలవకుండా వుండరు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు గలవారు తమ తమ పత్రికుల పెట్టుకోవచ్చు. వాటికి వ్యతిరేకంగా ఇతరులూ రాసుకోవచ్చు. అంతేగాని అదే అబ్సెషన్గా మార్చుకోవడం అవసరం లేని పని. జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు కూడా ఇలాగే జగన్నామస్మరణలో మునిగి తేలుతుంటే నేను చాలాసార్లు వారించేవాణ్ణి. అప్పుడంటే అధికారానికి పోటీ వస్తారని ఆందోళన వుండొచ్చు. కాని ఇప్పుడు అధికార పీఠం ఎక్కాక కూడా అనుభవం అవగాహన లేదంటూనే అహౌరాత్రాలు జగన్ సాక్షిల చుట్టూనే రాజకీయ చర్చను తిప్పడంలో తెలుగుదేశం వ్యూహం దాగి వుందనిపిస్తుంది. అసలైన సమస్యలను పక్కకు నెట్టడం, సభా సమయాన్ని వృథా చేసి తర్వాత హడావుడిగా అనుకున్నవి ఆమోదింపచేసుకోవడం, కాదంటే జివోలతో పని కానిచ్చేయడం..ఈ వలయంలో చిక్కుకున్న జగన్ తెలియకుండానే దూకుడు పేరిట పాలక పక్షం పథకాలు నెరవేరడానికి దోహదకారి అవుతున్నారు.
ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చినా ఓటుకు నోటు పక్క రాష్ట్ర వ్యవహారం అంటే చెల్లుతుందా? అయినా మీడియాతో పాటు సోషల్ మీడియాపైన కూడా దాడికి సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం తెలియకుండానే దేశమంతా కొత్తచర్చకు తనే రంగం సిద్ధం చేస్తున్నది. మంచిదే. గతంలో సాక్షితో పాటు ప్రజాశక్తిని 10 టీవీని కూడా ఆయన ప్రస్తావించి తర్వాత వెనక్కు తగ్గారు. నిజానికి గతంలో వైఎస్ తిట్టిపోసిన ఆ రెండు అనుకూల పత్రికలే ఇప్పుడు తమ అధినేతకు చెప్పలేనంత హాని చేస్తున్నాయని టిడిపి పూర్వ ఎంపి ఒకరు నాతో అన్నారు. ఏమైనా సాక్షిపైన జగన్పైన ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే పెద్ద ఎత్తున దాడి కేంద్రీకరించినట్టు కనిపిస్తుంది. ఆయనపై రాజకీయ దాడికీ ఆయన యాజమాన్యంలో వున్న పత్రికపై ఆంక్షలూ అభిశంసనలకూ మధ్య తేడాను అధికార పక్షం అర్థం చేసుకోవాలి. పురాణాల్లో స్నేహభక్తికన్నా వైరభక్తితో దేవుణ్ని త్వరగా చేర్చుకుంటారన్నట్టే ఈ ప్రతికూలదాడితో చంద్రబాబు సాక్షిని మరింత ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్లా మారిపోతున్నారు. ప్రతిపక్ష పత్రిక రాసేదాన్ని ఎలా చూడాలో అనుకూల పత్రికల కథనాలు ఏ మేరకు నమ్మాలో ప్రజలకు తెలియదా?