సినిమాలకు అంచనాలు ఎలా ఉంటాయో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ పార్టీలపై అంచనాలు అలాగే ఉంటాయి. సినిమాలపై అంచనాలను… ఆ సినిమా యూనిటే పెంచుకుంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అని… అదని ఇదని… తమ సినిమాలో ఉన్న విశేషాలను చెప్పుకుంటారు. దీంతో ప్రేక్షకులు ఊహించుకుంటారు. రాజకీయ పార్టీలు కూడా అంతే. తాము అధికారంలో ఉన్నామనో… ప్రతిపక్షంలో పోరాటాలు చేశామనో.. అధికార పార్టీపై వ్యతిరేకత ఉందనో అంచనాలు చెప్పేసుకుంటారు. అయితే ఫేవరేట్ల విషయంలోనే ఈ అంచనాలపై ఎక్కువ చర్చ జరుగుతోంది. అలాంటి చర్చ… సినిమాల్లో నిన్నటిదాకా వకీల్ సాబ్పై జరిగితే.. రాజకీయాల్లో తిరుపతి ఉపఎన్నిక విషయంలో వైసీపీపై జరుగుతోంది. ఆ పార్టీ ఐదు లక్షల మెజార్టీ టార్గెట్ గా పెట్టుకుని ఆ మేరకు ప్రకటలు చేస్తూ అంచనాలు పెంచుకోవడమే దీనికికారణం.
గత ఎన్నికల్లో రెండు లక్షల పైచిలుకు మెజార్టీ వైసీపీకి వచ్చింది. ఈ సారి ఐదు లక్షలు రావాలని సీఎం జగన్ మంత్రులందరికీ అంతర్గతంగా టార్గెట్ పెట్టి పంపించారు. మంత్రులు బయటకు వచ్చి తమకు గెలుపు అసలు మ్యాటరే కాదు…. మెజార్టీ కోసమే తిరుగుతున్నామని చెప్పుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సారధ్యంలో.. వైసీపీ బలగం అంతా తిరుపతిలో మకాం వేసింది. ఐదు లక్షల మెజార్టీ జపం చేస్తూ వారు ఊరూరా తిరుగుతున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు అంత కన్నా మెజార్టీ తగ్గితే… నైతికంగా ఓడిపోయారన్న ప్రచారం చేస్తారన్న టెన్షన్ ఇప్పుడు వైసీపీలో ప్రారంభమయింది. గెలిస్తే సరిపోదు… ఐదు లక్షల మెజార్టీ తెచ్చుకోవాలి. లేకపోతే.. ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమయిందన్న ప్రచారాన్ని విపక్షాలు చేస్తాయి.
ఐదు లక్షల మెజార్టీ అనేది .. అదీ కూడా కడప కాకుండా ఇతర స్థానాల్లో తెచ్చుకోవడం అంత తేలిక కాదు. ఎంత అధికార పార్టీ అయినా… ఎన్నిరకాల సంక్షేమ పథకాలు అమలు చేసినా… ఎంత వాలంటీర్లు పని చేసినా… ప్రజలు ఏకాభిప్రాయంతో ఎప్పుడూ ఉండరు. వైఎస్ చనిపోయిన తర్వాత వచ్చిన రాజకీయ భావోద్వేగ .. సానుభూతి సమరాల్లో అలాంటిఫలితాలొచ్చాయి. కానీ ఇప్పుడు… తిరుపతిలో వైసీపీ చనిపోయిన సిట్టింగ్ ఎంపీకి చాన్సివ్వలేదు. రాజకీయంగా పట్టున్న వ్యక్తికీ ఇవ్వలేదు. దీంతో ఆ అభ్యర్థిపై సానుభూతి వెల్లువెత్తే అవకాశం లేదు. ప్రభుత్వం నమ్ముకుంది సంక్షేమ పథకాల మీదే. కానీ ఒకరికి ఒక పథకం వస్తే.. ఆ చుట్టపక్కల వారు.. తమ ఇవ్వలేదని ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుకునే పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి. దీంతో ఐదు లక్షల మెజార్టీ అనేది మాట వరుసకు మాత్రమేనని…గత ఎన్నికల కంటేపెంచుకుంటామని.. పరిస్థితుల్ని తేలిక పర్చుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
ఐదు లక్షల కన్నా మెజార్టీ తగ్గితే జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై మూడోకన్ను తెరుస్తారు. అంత మెజార్టీ రావడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అనవసరంగా అంచనాలు పెంచేశామని… వైసీపీ నేతలు తిరుపతిలో కంగారు పడిపోతున్నారు. అంత మెజార్టీ రాకపోతే ఎలా అని… మథనపడుతున్నారు.