తెలంగాణ జె.ఎ.సి. ఛైర్మన్ కోదండరామ్ పై తెరాస నేతల ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఆయన్ని కాంగ్రెస్, టీడీపీ ఏజెంటుగా చిత్రీకరించడంతోనే తెరాస ఆగటం లేదు. అసలు ఆయన ప్రొఫెసర్ గా విద్యార్థులకు ఏమాత్రం న్యాయం చేయలేదని విమర్శించే స్థాయికి వెళ్లింది.
ముఖ్యంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు పరిహారం విషయంలో కోదండ రామ్ గట్టిగానే గళమెత్తారు. గ్రామాల్లో తిరిగారు. రైతులను సమీకరించారు. బహుముఖ పోరాటం చేశారు. ఇది తెరాస నేతలకు కోపం తెప్పించింది. చివరకు కేసీఆర్ కూడా కోదండరామ్ పోరుబాటపై ఆగ్రహించారు.
ప్రజా సమస్యలపై, జిల్లాల విభజనలో శాస్త్రీయతపై కోదండరామ్ అనేక సార్లు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీంతో దాదాపు రోజుకో తెరాస నేత ఆయన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. విద్యార్థి నేతగా పేరు పొంది, ఇప్పుడు కేసీఆర్ చలవతో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందిన పిడమర్తి రవి కూడా విమర్శలుగుప్పించారు.
కోదండరామ్ ప్రొఫెసర్ గా విద్యార్థులకు న్యాయం చేయలేదంటూ తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనకు ఎంతో మంది శిష్యులున్నారు. పాఠాలు చెప్పడంతో పాటు ఎంతోమంది విద్యార్థులకు ఆయన మార్గదర్శిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అసలు విద్యార్థులకు న్యాయం చేయని ఆచార్యుడిగా కనిపించడం ఆశ్చర్యకరం. కేసీఆర్ ఇచ్చిన పదవుల మాయలో పడి ఇలా మాట్లాడుతున్నారనే విమర్శలను కూడా ఈ నేతలు పట్టించుకోవడం లేదు. కోదండ రామ్ క్యారెక్టర్ ను కూడా దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో, ఆయన ఆ రెండు పార్టీల మనిషంటూ తెరాస ఎదురు దాడి చేయడం విశేషం.