సినిమా కోసం ఎంత కష్టపడినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా జయాపజయాలనేవి ఒక్క రోజులో, ఆమాటకొస్తే ఒక్క షోతోనే తెలిసిపోతాయి. సినిమా హిట్టా, ఫట్టా అనేది మార్నింగ్ షో ముగిశాక అర్థమైపోతుంది. యావరేజ్ సినిమాని కాస్త ముక్కీ మూలిగీ హిట్టుకు దగ్గరగా తీసుకురావొచ్చుగానీ, డిజాస్టర్లను మాత్రం ఎంత బతిమాలినా లాభం ఉండదు. ప్రమోషన్లతో మోత మోగించినా ఉపయోగం కనిపించదు. సినిమా విడుదలై.. ఫ్లాప్ అని తెలిసిపోయిన పది రోజులకు ‘అభినందన సభ’ అంటూ పెడితే దానికంటే మరో జోక్ ఉండదు. ఇప్పుడు నిర్మలా కాన్వెంట్ విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే చూసినోళ్లంతా నోరెళ్లబెట్టారు. నాగ్ది రాంగ్ ఛాయిస్ అని తేల్చేశారు. రోషన్ ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరైందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతటి సినిమాకి ఇక ప్రచారం ఎందుకు అనుకొన్నారో ఏమో.. పక్కన పెట్టేశారు. పాపం.. తనయుడి సినిమాకి ఎలాంటి హడావుడీ లేకపోయే సరికి శ్రీకాంత్ మనసు చివుక్కుమందేమో? పబ్లిసిటీ బాధ్యత తనపై వేసుకొన్నాడు. ఈ సినిమాని గురువుగారు దాసరి నారాయణరావుకి చూపించి ఆయన ఆశీస్సులు కోరుకొన్నాడు. ఈరోజు మధ్యాహ్నం నిర్మలా కాన్వెంట్ చూసిన దాసరి కర్టెసీకి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి… చిత్రబృందాన్ని అభినందించి.. అది కాస్తా అభినందన సభగా మార్చేశారు.
ఎలాగూ ప్రెస్ మీట్ పెట్టాం కదా అని సినిమాని పొగడక తప్పలేదు. ప్రతీ సీనూ అద్భుతంగా ఉందని, నాగార్జున పాత్ర బాగా పండిందని, ఈ సినిమాలోని హీరోని చూస్తుంటే తనని తాను చూసుకొన్నట్టు ఉందని.. ఇంకా చాలా చాలా చెప్పారు. ఈ మాటలు పక్కనే ఉన్న శ్రీకాంత్కి కంటితుడుపుగా అనిపించినా.. మీడియా వాళ్లకూ, ఈ సినిమా చూసిన జనాలకు ఇంతకంటే కామెడీ మరోటి కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా గురించి మర్చిపోయారంతా. ఈ దశలో నిర్మలా కాన్వెంట్ విశిష్టతలు మళ్లీ కొత్తగా చెప్పుకు రావడం, ఈ సినిమా ప్రమోషన్లకో, కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికో శ్రీకాంత్ తాపత్రయపడడం కాస్త వింతగా అనిపిస్తోంది. శ్రీకాంత్ ఇప్పుడు చేయాల్సింది నిర్మలా కాన్వెంట్ పబ్లిసిటీ బాధ్యతలు చూసుకోవడం కాదు. తన తనయుడికి ఎలాంటి కథలు సిద్దం చేయాలా, ఏ దర్శకుడి చేతిలో పెట్టాలా అని ఆలోచించాలి. ఎలాగూ మరో రెండేళ్ల వరకూ రోషన్తో సినిమాలు చేయించకూడదని డిసైడ్ అయినప్పుడు ఈ ఆర్భాటాల మోజెందుకో..??