హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. అధికార ప్రతినిధి, మాదిగ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై విమర్శలు చేయటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణపై పుల్లారావు అవగాహన లేకుండా మాట్లాడారని డొక్కా మండిపడ్డారు. ఆయన తన వ్యవసాయశాఖపై దృష్టిపెడితే మంచిదని కూడా నిన్న డొక్కా వ్యాఖ్యానించారు. అయితే నిన్న తాను చేసిన వ్యాఖ్యలకుగానూ డొక్కా ఇవాళ సారీ చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, పుల్లారావు తనకు మంచి మిత్రుడని, తామంతా చాలా బాగుంటామని, బ్రదర్స్లాగా ఉంటామని అన్నారు. పుల్లారావు గురించి నిన్న మాట్లాడేటపుడు, కమ్యూనికేట్ చేయటంలో చిన్న పొరపాటు జరిగిందని చెప్పారు. పుల్లారావు ఏమైనా నొచ్చుకుని ఉంటే తాను సారీ చెబుతున్నానని అన్నారు. “పుల్లారావుగారూ ఏమీ ఫీలవ్వొద్దు… పత్రికల్లో వచ్చినదానికి ప్రజల్లో వచ్చిన రియాక్షన్కు నేను సమాధానం చెప్పాను, దానికి కిషోర్ బాబు సవరణ ఇచ్చారు. ఆ ఇష్యూ నిన్నటితో అయిపోయింది” అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణను ముందుకెలా తీసుకెళ్ళాలనేదానిపై తాము మాట్లాడుకుంటామని అన్నారు. పుల్లారావు తమ మంత్రి అని, ఆయనకిచ్చే గౌరవం ఆయనకిస్తామని డొక్కా చెప్పారు.
పుల్లారావు ఈ వివాదంపై స్పందిస్తూ, వర్గీకరణ సున్నితమైన అంశమని, దీనిపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల భావం వేరని చెప్పారు. తమ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పారు. వర్గీకరణపై పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చర్చ జరగాల్సి ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే డొక్కా మంత్రి పుల్లారావుపై విమర్శలు చేయటాన్ని టీడీపీ మరో నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. డొక్కా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. మరోవైపు వర్గీకరణ అంశంపై చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నమందకృష్ణ మాదిగతో డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇవాళ గుంటూరులో ఒక హోటల్లో భేటీ అయ్యారు.