ప్రొ.నాగేశ్వర్: ముందస్తు ఎన్నికలపై ముసురుకుంటున్న ప్రశ్నలు..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వాతారవణం స్పష్టంగా కనిపిస్తోంది. ముందస్తుపై చర్చ జరుగుతోందని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని.. కాంగ్రెస్ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. అయితే ముందస్తు మాత్రం కచ్చితంగా జరుగుతాయని అధికార పార్టీ నేతలు ఫీలర్స్ పంపుతున్నారు.

ముందస్తుకు పూర్తి స్థాయిలో సిద్ధమైన టీఆర్ఎస్..!

ముందస్తు ఎన్నికలపై.. మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. కేటీఆర్… ముందస్తుపై అన్నీ మీడియా లోనే వస్తున్నాయని.. తమకేమీ సంబంధం లేదన్నట్లుగా మాట్లాడారు. ఎంపీ సీతారాంనాయక్.. టీవీ చానళ్లకు.. ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ వినోద్..ముందస్తుపై చర్చ జరుగుతోంది కానీ… ఇంకా ముహుర్తం నిర్ణయించలేదని చెబుతున్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే.. ముందస్తుపై చర్చిస్తున్నది నిజం.. ముందస్తుపై ఆలోచిస్తున్నది..నిజం. అయితే.. టీఆర్ఎస్ ను ఓ సందేహం వెంటాడుతోంది. తాము అసెంబ్లీని రద్దు చేసినా ఎన్నికలు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందా లేదా అన్నదే ఆ సందేహం. అలా నిర్వహించాలంటే.. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. రాజ్యాంగబద్ధంగా ఈసీని ఎవరూ ప్రభావితం చేయలేరు. కానీ ఈసీపై కేంద్రం ప్రభావం ఉంటుంది. దీనికి చక్కటి ఉదారహణ.. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్. ఈసీ ప్రకటించక ముందే… బీజేపీ ఐటీసెల్ అధ్యక్షుడు.. తేదీను సోషల్ మీడియాలో ప్రకటించారు. అలాగే కర్ణాటకలో బలపరీక్ష ఎదుర్కోవడానికి యడ్యూరప్పను ఆహ్వానించినప్పుడు.. గవర్నర్ లేఖ ముందుగా బీజేపీ నేతల ట్విట్టర్లలోనే కనిపించింది. నిజానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేంద్రం అనుమతి అవసరం లేదు. అసెంబ్లీని రద్దు చేస్తే.. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం ఈసీ విధి.

ముందస్తుకు వెళ్లడానికి కేంద్రం పర్మిషన్ అవసరం లేదు..!

చట్టపరంగా.. కేంద్రానికి తెలంగాణ ముందస్తుపై ఎలాంటి అధికారం లేదు. అది పూర్తిగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ వ్యవహారం. కానీ… ముందస్తుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. అది పూర్తిగా రాజకీయ వ్యవహారం. ఈసీని కేంద్రం ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి… కేసీఆర్ అలా..మోడీ దగ్గరకు వెళ్లారు. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కూడా.. ఈసీ ఎన్నికలు నిర్వహించకపోతే.. ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ప్రస్తుత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముందస్తుకు వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్న తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఆరు నెలల గడువులోపు అసెంబ్లీ సమావేశమై తీరాలి..!

భారత రాజ్యాంగం ప్రకారం.. రెండు సెంబ్లీ సెషన్ల మధ్య ఆరు నెలల మించి గడువు ఉండకూడదు. అంటే.. ఓ సారి సభ వాయిదా పడిన తర్వాత ఆరు నెలలోనే సభను విధిగా సమావేశపరచాలి. అది కొత్త అసెంబ్లీకి అయినా.. అప్పటికే ఉన్న అసెంబ్లీని అయినా సమావేశపరచాల్సిందే. మార్చి ఇరవై తొమ్మిదో తేదీన చివరి సారి అసెంబ్లీ సమావేశం జరిగింది. అక్కడ్నుంచి ఆరు నెలలు అంటే..సెప్టెంబర్ 29లోగా… మరో సమవేశం జరపాల్సి ఉంటుంది. అందుకే సెప్టెంబర్ పదో తేదీలోపు ఓ సమావేశం జరిపి.. అప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే అదే సమయంలో.. మరో పాయింట్ ఏమిటంటే.. జూన్ రెండో తేదీన గవర్నర్ ప్రోరోగ్ చేశారు. మామూలుగా అయితే… మార్చి 29న చివరి సమావేశం జరిగింది. కానీ గవర్నర్ మాత్రం జూన్ రెండో తేదీన ప్రోరోగ్ చేశారు కనుక.. అప్పటి వరకూ శాసనసభ సమావేశాలు ఉన్నట్లే లెక్క అన్న దాన ఉంది. దాని ప్రకారం.. డిసెంబర్ వరకూ సమావేశాలు నిర్వహించాల్సిన పని లేదు. సెప్టెంబర్ పదో తేదీలోగా.. సమావేశాలు నిర్వహించి.. అసెంబ్లీని రద్దు చేస్తారు. అలా చేసినా..నిబంధనల ప్రకారం.. అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంటుంది. అంటే మూడు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

కేసీఆర్ ముందస్తుకు మోడీ సంపూర్ణ సహకారం..!

ముందస్తుకు సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ.. ఒక్కసారి శాసనసభను రద్దు చేసిన తర్వాత .. టీఆర్ఎస్ కానీ.. కేసీఆర్ కానీ పూర్తిగా మోడీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. అలాగే ఎన్నికల కమిషన్ నిర్ణయాలపై ఆదారపడాలి. అలాంటి పరిస్థితి కూడా రాకూడదని.. కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానిని ఒప్పించినా కూడా.. ఎన్నికల కమిషన్ చెప్పినట్లు వినాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌లో అసెంబ్లీని సమావేశపరిచి.. అసెంబ్లీని రద్దు చేస్తే.. మళ్లీ మార్చిలోగా.. కొత్త శానసభను సమావేశ పరచాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరి చివరిలోగా ఎన్నికలు పూర్తి చేయాలి. జరిగితే.. మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు నిర్వహించాలి. లేకపోతే.. ఫిబ్రవరిలోపే నిర్వహించాలి. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారు.

జమిలిని సమర్థించి.. ఎందుకు విడిగా ఎన్నికలకు వెళ్తున్నారు..?

ఇలాంటి సమయంలో… ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారన్న విమర్శలు టీఆర్ఎస్ పై వస్తున్నాయి. ఆరు నెలలు ముందస్తు కాదనుకుంటున్నప్పుడు.. ఆరు నెలల ముందుగా ఎందుకు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జమిలీ ఎన్నికలకు.. బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. జమిలి ఎన్నికలు.. చాలా లాభమని… టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ప్రకటించారు. చాలా ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అలా చెప్పి.. ఇప్పుడు… సాధారణంగా రావాల్సిన జమిలీ ఎన్నికలను కూడా బ్రేక్ చేస్తున్నారు. పార్లమెంట్ కన్నా ముందుగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పై ఉంది. రాజకీయ అవసరాల కోసమే… జమిలీని బ్రేక్ చస్తున్నారు. జమిలీ ఎన్నికల విషయంలో.. టీఆర్ఎస్ విధానాన్ని టీఆర్ఎస్సే ఎందుకు ఉల్లంఘిస్తోంది..?

ముందస్తు వచ్చినా ఫిబ్రవరిలోనే ఎన్నిక ప్రక్రియ పూర్తి కావాలి..!

కేంద్రంతో టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. 2019 తర్వాత బీజేపీకి మద్దతిస్తామని..కేసీఆర్ హామీ ఇచ్చి ఉంటారు. అందుకే ముందస్తుకు వెళ్లండి..మేము చూసుకుంటామని.. మోడీ హామీ ఇచ్చి ఉంటారు. ఈసీకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓటర్ల జాబితాను సవరించడం.. వీవీ పాట్ మెషిన్లను సమకూర్చుకోవడం వంటివి వాటిలో ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ఈసీ దగ్గర ఏమైనా అడ్డంకి ఉన్నదమో అన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రధానితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉండవచ్చు. ఇక్కడ బీజేపీకి ఎలాంటి ఆశలు లేవు. టీఆర్ఎస్ తో సన్నిహిత సంబంధాలు కోసమే.. మోడీ.. టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. మార్చిలోపు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరిలోపే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.