పవన్ కి ఇటు చింతా పొగడ్తలు, అటు టి-కాంగ్రెస్ తెగడ్తలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సడెన్ గా కెసియార్ ని కలిసి “వీడి చర్యలు ఊహాతీతం” అని మరొకసారి తెలియజేసుకున్నారు. అయితే పవన్ కి కూడా ఇటు టి-కాంగ్రెస్ నాయకుల నుంచి వార్నింగులూ, తెగడ్తలూ, మొదలయ్యాయి. అయితే ఆశ్చర్యంగా చింతా మోహన్ అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుడి నుంచి పొగడ్తలూ మొదలయ్యాయి.

“సంపాదనమీద ఆసక్తి లేని నాయకుడు, మచ్చలేని వ్యక్తి, నిజాయతీ పరుడు, నిలదీసే మొనగాడు రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నాడని అతడికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని” సీనియర్ రాజకీయ నాయకుడు చింతా మోహన్ వ్యాఖ్యానించారు. గత అరవై ఏళ్ళుగా అధికారం చేపట్టని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ సారి సీఎం అవుతాడని జోస్యం చెప్పారు. ఇది ఆయన పవన్ కళ్యాణ్ ని ఉద్దేశ్యించి చేసిన వ్యాఖ్యలేనని చెప్పక్కర్లేదు. బహుశా జనసేన లో టికెట్ ఖాయం చేసుకోవడానికి ఈ మాజీ ఎంపీ (తిరుపతి) ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు మొదలయ్యాయి.

ఇక కెసియార్ ని కలిసి వచ్చాక టి కాంగ్రెస్ నాయకులు పవన్ మీద విరుచుకు పడుతున్నారు. విహెచ్ అయితే అసలు తెలంగాణా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని వార్నింగులు ఇచ్చేసారు. పవన్ కళ్యాణ్, కేసీఆర్ ల మధ్య సీక్రెట్ డీల్ కుదిరిందని విహెచ్ ఆరోపించారు. కేసీఆర్ మాయలో పవన్‌కల్యాన్ పడ్డారని రేవంత్ వ్యాఖ్యానిస్తే, తెలంగాణ రాజకీయాల్లో తలదూరిస్తే పవన్ కు ఆయన అభిమానులే బుద్ది చెబుతారని కోమటిరెడ్డి అన్నారు.

మొత్తానికి 2018 లో పవన్ కి రాజకీయ అడుగులూ, రాజకీయ సెగలూ ఎక్కువగా ఉండేలా ఉంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.