తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జిల్లాలోని వివిధ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కాలనీల్లో నిర్మించిన ఖాళీ వాణిజ్య దుకాణాల వేలానికి సిద్ధమైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బండ్లగూడ, జంగమ్మెట్, ఫరూక్ నగర్, ధూల్పేట్, కమలానగర్ , సికింద్రాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఈ దుకాణాలను ఉన్నది ఉన్నట్లుగా ప్రాతిపదికన బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 5న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ఆసక్తి గల అభ్యర్థులను వేలంలో పాల్గొనాలని కోరారు.
ఈ వేలం ప్రక్రియ రెండు రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో జరగనుంది. ఏప్రిల్ 15న హైదరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో బండ్లగూడ, జంగమ్మెట్, ఫరూక్ నగర్ మరియు ధూల్పేట్ ప్రాంతాల్లోని దుకాణాలకు వేలం నిర్వహిస్తారు. ఇక్కడ చదరపు అడుగు కనీస ధర 5,000 నుండి 8,000 వరకు నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 16న సికింద్రాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో కమలానగర్, చిలకలగూడ , ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని దుకాణాలకు వేలం ఉంటుంది. విశేషమేమిటంటే, కమలానగర్ కాలనీలోని దుకాణాలకు అత్యధికంగా చదరపు అడుగుకు రూ.20,000 కనీస ధరగా నిర్ణయించారు.
వేలంలో పాల్గొనదలచిన వారు ప్రాథమిక నిబంధనగా రూ. 30,000 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను ఈర్నెస్ట్ మనీ డిపాజిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ డీడీని డిస్ట్రిక్ట్ కలెక్టర్, హైదరాబాద్ జిల్లా పేరుతో ఏదైనా జాతీయ లేదా షెడ్యూల్డ్ బ్యాంకు నుండి తీసుకోవాలి. వేలం జరిగే రోజున ఉదయం 9:30 గంటల నుండి 11:00 గంటల లోపు సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో ఈ డీడీలను అందజేసి తమ పేరును నమోదు చేసుకోవాలి. దుకాణాల విస్తీర్ణం 66 చదరపు అడుగుల నుండి 252 చదరపు అడుగుల వరకు వివిధ పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ వేలం ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే హౌసింగ్ ఆఫీస్ మేనేజర్లను లేదా ఆయా ఆర్డీఓ కార్యాలయాల నంబర్లలో సంప్రదించవచ్చు. పారదర్శకమైన పద్ధతిలో ఈ వేలం జరుగుతుందని, చిన్న వ్యాపారులకు ఇది మంచి అవకాశమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నిర్ణయించిన తేదీల్లో ప్రభుత్వ సెలవు దినం వస్తే, తర్వాతి పనిదినం రోజున వేలం యధావిధిగా కొనసాగుతుంది.
