హైదరాబాద్లో ఉన్న రూ. 5 అన్నపూర్ణ భోజనం కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మారుస్తూ GHMC స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ భోజన కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి అన్నపూర్ణ అని పేరు పెట్టారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నపూర్ణ కేంద్రాలను విస్తరించింది. కానీ పేరు మార్చలేదు. అదే పేరుతో కొనసాగించింది.
ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటిని ఇందిర పేరుతో మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం మధ్యాహ్నం మాత్రమే ఐదు రూపాయలకు భోజనం అందిస్తారు. ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ రూ. 5కే అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగేప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను శాశ్వత కట్టడాలుగా మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాలు.. తాత్కలిక ఏర్పాట్లు ఉన్నాయి. భోజనంలో 400 గ్రాముల అన్నం , 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూరగాయ కూర, 15 గ్రాముల ఊరగాయ ఉండేలా మెనూ మార్చనున్నారు.
కొన్ని క్యాంటీన్లు షెడ్లు తుప్పు పట్టడం , నిర్మాణ శిథిలావస్థ కారణంగా ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే గ్రేటర్ అధికారులు ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. కొత్తగా కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని చోట్లా నిలబడి తినాల్సి ఉంటుంది. సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అన్నపూర్ణ క్యాంటీన్లు ఇప్పటి వరకూ 10 కోట్ల భోజనాలను పేదలకు అందించాయి. కోవిడ్ లాక్డౌన్ సమయంలో పేదల ఆకలి తీర్చి మంచి పేరు తెచ్చుకున్నాయి.