పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు సభ్యుడి ఇళ్లు, ఆఫీసులపై దాడులుచేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు బిత్తరపోయారు. ఏకంగా 90 కోట్ల రూపాయల నగదు, 100 కిలోల బంగారం బయటపడటంతో వాళ్లే నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. దేశంలోనే అతి పెద్ద ఐటీ ఆపరేషన్లలో ఇదీ ఒకటి అంటున్నారు.
టీటీడీప ట్రస్ట్ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఆఫీసులు, ఇళ్లతో పాటు అతడి బంధువుల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. చెన్నైలోని మొత్తం 8 చోట్ల ఈ దాడులు జరిగాయి. గనులు, ఇసుక వ్యాపారి అయిన శేఖర్ రెడ్డి దగ్గర భారీగా బ్లాక్ మనీ ఉందనే పక్కా సమాచారంతో ఈ దాడి జరిగింది. పట్టుబడిన 90 కోట్లలో 70 కోట్లు కొత్త 2 వేల రూపాయల నోట్లే. విడుదలైన నెలరోజుల్లో, ఆ ఒక్కడి దగ్గరికి 2 వేల నోట్లు అంత భారీగా ఎలా చేరాయనేది ప్రశ్న,
రాజకీయ, బ్యాంక్ అధికారుల లింక్ లు కూడా బయటపడాల్సి ఉందంటున్నారు. ఈ డబ్బు, బంగారం అతడివేనా లేక రాజకీయ నాయకులు ఇతరులకు డబ్బు మార్పిడి చేయడానికి ప్రయత్నించాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడులోని అధికార పార్టీలో అతడికి పలువురు పెద్ద నేతలతో పరిచయాలున్నాయట. పైగా ఆ పార్టీలోనూ అతడు కీలకమైన నేత అంటున్నారు. అయితే కొత్త 2 వేల రూపాయల నోట్లు ఇన్ని కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా రావడం వెనుక కొందరు బ్యాంక్ అధికారుల లాలూచీ కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద అనుమానితులందరినీ ప్రశ్నించి నిజాలు రాబట్టే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమై ఉన్నారు.