హైదరాబాద్ మాజీ మేయర్ హటాత్తుగా పార్లమెంట్ భవనంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో కనిపించడం కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన కీలక సమాచారం తన దగ్గరుందని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పారు. ఆ సందర్భంగా ఆయన చుట్టూ చాలా మంది కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు ఉన్నారు. వారితోపాటు మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి, ఆమె భర్త కూడా ఉండటం సంచలనం కలిగించింది.
లైవ్ లో ఈ దృశ్యాలు కనిపించగానే పలు తెలుగు న్యూస్ చానల్స్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్ అయింది. సరిగ్గా రాహుల్ గాంధీ వెనకే కార్తీక ఉండటంతో ఆమె పార్లమెంటు భవనంలోకి ఎలా వెళ్లింది, వెళ్లడం తప్పు కదా అంటూ రకరకాల ఊహాగానాలతో చానల్స్ ఊదరగొట్టాయి. ఎంపీ పాస్ ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లారట. ఎస్ పి జి భద్రతా వలయాన్ని తప్పించుకుని కమిటీ హాలు వరకూ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారట. రాహుల్ కు సన్మానం కూడా చేశారట. ఇదీ బ్రేకింగ్ న్యూస్ సారాంశం.
ఎంపీ పాస్ ద్వారా పార్లమెంట్ సమావేశాలను చూడటానికి సందర్శకులు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకమైన అపాయింట్ మెంట్ ద్వారా నాయకులను కలవడానికి కొందరు ప్రముఖులకు అవకాశం కూడా ఉంటుంది. కార్తీక మాజీ మేయర్. కాబట్టి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లారా లేక ఎంపీ పాస్ ను దుర్దినియోగం చేశారా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.
ఇటీవల క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. తన పెళ్లి శుభలేఖ ఇచ్చారు. ముందస్తు అపాయింట్ మెంట్ తీసుకుని ప్రధానిని కలిశారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు. ఆయన్ని కార్తీక అపాయింట్ మెంట్ తీసుకుని పార్లమెంట్ కమిటీ హాలులో కలిసి ఉంటే అది వేరే విషయం. ఏదీ నిర్ధారణ కాకుండానే కొన్ని చానళ్లు ఇష్టం వచ్చినట్టు బ్రేకింగ్ న్యూస్ తో కలకలం రేపాయి.