తెలంగాణలోనూ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం కానీ డబ్బు కాదని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ వేయించాలంటే రెండున్నర వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ మొత్తం ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. మే ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతున్నందున.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించే టీకాలు ఉచితమేనని… ప్రకటించింది. అయితే..కేంద్రం పంపించే టీకాలు… ఆయా రాష్ట్రాల జనాభాల్లో పది శాతంమందికి కూడా చేరవు. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లనే వేయాలంటే.. మూడు, నాలుగేళ్లు వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే.. తాము అంత ఎక్కువగా.. సరఫరా చేయలేం కాబట్టే.. కొనుక్కోవడానికి కేంద్రం అవకాశం ఇచ్చింది. పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలకు వ్యాక్సిన్ అమ్ముకునేందుకు అనుమతి ఇస్తున్నారు. దేశీయ వ్యాక్సిన్ తయారీదారులు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి రుణాలు కూడా ఇచ్చారు.ఈ క్రమంలో రాష్ట్రాలు ఇతర మార్గాల ద్వారా వ్యాక్సిన్లు సమకూర్చుకునే అవకాశం కల్పించింది.
ఎలా చూసినా వ్యాక్సిన్ … రాష్ట్ర ప్రభుత్వాలకు భారం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎంత భారం అవుతుందన్న దానిపై అంచనాలు లేకపోయినా… రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఖర్చులు భరించేందుకు సిద్దమవుతున్నాయి. ఏపీ సర్కార్ రూ. పదహారు వందల కోట్లు ఖర్చవుతుందని నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో ఆ ఖర్చు రెండున్నర వేల కోట్లుగా అంచనా వేశారు. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా… తాము కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటిస్తున్నాయి.