నీటి పారుదల ప్రాజెక్టులకు భూసేకరణ తెలంగాణలో వివాదాస్పదంగా మారింది. మల్లన్న సాగర్ భూసేకరణపై ఒక విధంగా యుద్ధమే జరిగింది. ప్రతిపక్షాలు సుదీర్ఘపోరాటం చేశాయి. కేసీఆర్ ప్రభుత్వ తీరును హైకోర్టు కూడా తప్పు పట్టింది. దీంతో అత్యుత్తమ భూసేకరణ విధానానికి సీఎం కేసీఆర్ సంకల్పించారు.
కొత్త భూసేకరణ బిల్లు ముసాయిదాలో పలు కీలకాంశాలున్నాయి. ముంపు బాధితులకు పునరావాసంలో పలు మానవీయ అంశాలున్నాయి. బాధితులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడం వీటిలో ఒకటి. భూసేకరణ వల్ల నిర్వాసితులు నష్టపోయే మొత్తం, ఇతర అంశాలను సమగ్రంగా పరిగణన లోకి తీసుకుని పరిహారం చెల్లిస్తారు. రైతులు నిరసన గళమెత్తే వరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని, రైతు హిత ప్రభుత్వంగానే ఖ్యాతి పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పరిహారం విషయంలో గుజరాత్ లో అమలవుతున్న తీరు బాగుందని కేసీఆర్ దృష్టికి వచ్చింది. అక్కడ ప్రభుత్వం ఉదారంగా పరిహారం చెల్లిస్తుందని పేరుంది. అందుకే దాదాపుగా, గుజరాత్ లో ఎక్కడా భూసేకరణ వివాదాలు లేవంటారు. తెలంగాణలో కూడా గుజరాత్ మోడల్ లోని కొన్ని అంశాలు, కొన్ని కొత్త అంశాలను జోడించి చట్టం చేయనున్నారు. కొత్త భూసేకరణ ముసాయిదాకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.