ఈమధ్య లావణ్య త్రిపాఠీ కొద్ది పాటి ఇబ్బందుల్లో చిక్కుతుంది. తెలుగులో విడుదలై మంచి విజయం సాధించిన 100 % సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. కథానాయికగా అవకాశం లావణ్య త్రిపాఠీకి వరించింది. కొన్ని రోజులు షూటింగ్ అవ్వగానే ఈ టీమ్ నుంచి లావణ్య కావాలనే తప్పుకుంది. దాంతో తమిళ నిర్మాతలు లావణ్యపై ఫైర్ అయ్యారు. ఆమెపై తమిళ నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారు. ‘మా’ లోనూ ఆమెపై కంప్లైంట్ నమోదయ్యింది. లావణ్య స్థానంలో మరో కథానాయికని ఎంచుకుని, ఆమెపై రీషూట్లు చేయడం వల్ల తాము చాలా నష్టపోయామని, అందుకు ప్రతిగా రూ.2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని తమిళ నిర్మాత డిమాండ్ చేశారు. లావణ్య కూడా కొంత మొత్తం నష్టపరిహారం చెల్లించిందని వార్తలొచ్చాయి.
వీటిపై లావణ్య త్రిపాఠీ స్పందించింది. తానేం నష్టపరిహారం చెల్లించలేదని, నిర్మాతతో కూర్చుని మాట్లాడుకుని శాంతియుతంగానే ఈ సమస్యని పరిష్కరించుకున్నానని క్లారిటీ ఇచ్చింది. ”రెండు కోట్లు, మూడు కోట్లు అని ఏవేవో వార్తలు రాశారు. నా పారితోషికమే అంత ఉండదు కదా. అలాంటిది అంత మొత్తం ఎలా చెల్లిస్తాను? ఆ వివాదం తరవాత నేను నిర్మాతని కలిశాను. మేం కూర్చుని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలాంటి గొడవలూ లేవు. నేను డబ్బులేం ఇవ్వలేదు” అని చెప్పేసింది లావణ్య.