`మా` ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల సమయంలో రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న `మా`.. ఫలితాలొచ్చాకైనా మళ్లీ కలిసి పనిచేస్తారనుకుంటే – `మా`మధ్య విబేధాలు ఇప్పట్లో చల్లారేవి కావని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటున్నారు. `మా` మధ్య చీలికలు తప్పవని మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉన్నారు. మార్చి 31 వరకూ కుర్చీ వదలను అని భీష్మించుకుని కూర్చోవడంతో శివాజీరాజా కాస్త ఓవర్ చేశాడు. ఆయనకు లెక్కప్రకారం మార్చి 31 వరకూ అధికారం ఉంది.కానీ.. ఓసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక… ఆ అధికారం కూడా నామ మాత్రమే. అలాంటిది ఎన్నికలు జరిగి, అధికారిం చేతులు మారాక కూడా `ఇది నా కుర్చీ` అని కూర్చోవడం, కోర్టుకు వెళ్తానని వాదించడం చిన్నపిల్లల ఆటగా కనిపిస్తోంది.
శివాజీ రాజా ఓవర్ చేశాడనుకుంటే.. నరేష్ మరీనూ. శివాజీ రాజా మాట పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి – కుర్చీ నుంచి లేస్తావా? లేదా? అంటూ అల్టీమెట్టం జారీ చేశాడు. నువ్వు కుర్చీ ఖాళీ చేయకపోతే పెద్దల వరకూ వెళ్లాల్సివస్తుందని హెచ్చరించాడు. ఈనెల 22న ప్రమాణ స్వీకారం చేస్తున్నా – ఈలోగా తట్టా బుట్టా సర్దుకో – అంటూ తేల్చేశాడు. ఈనెల 22కీ.. మార్చి 31కీ మధ్య కనీసం వారం రోజులు గ్యాప్కూడా లేదు. ఈలోగా ఏం కొంపలు మునిగిపోతాయి? నిజానికి ఇది `మా`లో తేల్చుకోవాల్సిన వ్యవహారం. నాలుగ్గోడల మధ్య ఇలాంటివి తేలిపోవాలి. దాన్ని పట్టుకుని రచ్చబండ కార్యక్రమంలా నలుగురిలో పెట్టడం ఎందుకు? ఇదంతా మా పరువుని బజారుకి ఈడ్చేయడం కాదా?? `మా`లో ఇంత జరుగుతున్నా చిరంజీవి లాంటి పెద్ద మనుషులు ఎందుకు కలగచేసుకోవడం లేదు? మీలో మీరు తన్నుకుని చావండి, మిగిలినవాళ్లు రండి.. అంటూ మౌనంగా ఎందుకు కూర్చున్నారు..? వ్యవహారం చూస్తుంటే.. నరేష్ రెండేళ్ల పదవికాలంలో ఇలాంటివి మరెన్నో చూడబోతున్నామన్న అనుమానాలు కలుగుతున్నాయి. `మా` పరువు నిలబెడతాం.. అని చెప్పి పీఠం ఎక్కిన వాళ్లే.. ఇలా చేస్తే.. ఇంకెవరికి చెప్పుకోవాలి??