పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజులు కష్టమైనా దేశానికి మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఇది 1971లో తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
1971లోనే అవినీతి, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీకి సూచనలు వచ్చాయి. వాంగ్ చూ కమిటీ సాధికారికంగా ఈమేరకు ఇందిరకు నివేదిక సమర్పించింది. నోట్ల చెలామణితో పాటు అవినీతి కూడా ప్రమాదకర స్థాయికి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది ఆర్థిక వేత్తలు కూడా ఇదే సలహా ఇచ్చారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ గెలవాలని లేదా అని ఇందిర ఆనాడు ప్రశ్నించారు. అంటే పెద్ద నోట్ల రద్దు రాజకీయంగా లబ్ధి కలిగించేది కాదన్న మాట. తాను మాత్రం పార్టీ కంటే దేశమే ముఖ్యమనే ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాను అన్నారు మోడీ. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇందిరా గాంధీ హయాం నాటి వాస్తవాన్ని గుర్తు చేశారు.
ఇందిర హయాంనాటి 1971తో పోలిస్తే ఇప్పుడు అవినీతి భారీగా పెరిగింది. రాజకీయ అవినీతి అయితే చెప్పనవసరం లేదు. ఈనాటి కొన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా దిగజారాయంటూ మోడీ ఆవేదన వ్యక్తం చేస్తూనే చురక అంటించారు. 1971లోనే, సరిగ్గా ఇదే రోజు అంటే డిసెంబర్ 16న యుద్ధంలో పాకిస్తాన్ ఓటమిని అంగీకరించి, బంగ్లాదేశ్ విమోచనానికి ఒప్పుకుందని మోడీ చెప్పారు. ఆనాటి భారత్ విజయానికి సాక్ష్యం చూపాలని అప్పటి ప్రతిపక్షాలు అడగ లేదన్నారు. ఇటీవలి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కొందరు ప్రతిపక్ష నాయకులు ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో మరీ ఇంత దిగజారుడుతనమా అంటూ కొన్ని విపక్షాలను తూర్పారబట్టారు.