ఈరోజు హైదరాబాద్లో మోహన్ బాబు మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మామూలుగా అయితే ‘గాయత్రి’ గురించి ఆయన మాట్లాడతరేమో అనుకుంటారు. కానీ మోహన్ బాబు ఉద్దేశ్యాలు వేరని సమాచారం. ఈ ప్రెస్ మీట్లో మోహన్బాబు కొన్ని ‘బాంబులు’ పేల్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ‘త్వరలో అందరి గురించి నిజాలే మాట్లాడతా’ అంటూ ఓ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నిజాలు మాట్లాడుకోవడానికి సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘గాయత్రి’ పరాజయం పాలైంది. దానికి కారణమేంటో ఆయన తెలుసుకున్నారని, దాని గురించి కూడా మాట్లాడతారని, పనిలో పనిగా పైరసీ, ధియేటర్ల సమస్య, ఒకేరోజు మూడు నాలుగు సినిమాలు విడుదల కావడం.. వీటిపై కూడా స్పందిస్తారని తెలుస్తోంది. ‘గాయత్రి’ సినిమాలో టీడీపీ పార్టీపై, అందులోని నాయకులపై నేరుగానే సెటైర్లు వేశారు మోహన్ బాబు. వాటి ప్రస్తావన కూడా ఈ ప్రెస్ మీట్లో రానుంది. దాని గురించి మోహన్ బాబు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలపై తన వైఖరి స్పష్టం చేయడానికి మోహన్ బాబు అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని, ఆ టైమ్ వచ్చేసిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ రోజు హైదరాబాద్లోని ప్రసాద్ లాబ్స్లో మోహన్ బాబు ఎవరిపై, ఎలాంటి సెటైర్లు వేస్తారో చూడాలి.