‘హనుమాన్’ సినిమా అంతా ఒక ఎత్తు. చివరి 20 నిమిషాలూ మరో ఎత్తు. క్లైమాక్స్ లో హనుమంతుడి విశ్వరూప దర్శనం జరిగిపోయింది. దాంతో సినిమా రేంజ్ పెరిగిపోయింది. చిన్న సినిమాగా వచ్చి, పాన్ ఇండియా స్థాయిలో విజయ విహారం చేసిందంటే కారణం.. హనుమంతుడి మ్యాజిక్. ఇప్పుడు పార్ట్ 2 రాబోతోంది. ‘జై హనుమాన్’ పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. పార్ట్ లో హనుమంతుడి పార్ట్ ఎక్కువగా ఉండబోతోందన్నది అందరి ఊహ, అంచనా. అయితే… ట్విస్టేమిటంటే, పార్ట్ 2లో శ్రీరాముడి పాత్రకీ అగ్ర తాంబూలం ఇవ్వబోతున్నాడు ప్రశాంత్ వర్మ. త్రేతాయుగంలో శ్రీరాముడు – హనుమంతుడు ఇచ్చిపుచ్చుకొన్న ఓ వాగ్దానం కలియుగంలోనూ ఎలా నిలబెట్టుకొన్నారు? అనే పాయింట్ చుట్టూ ‘జై హనుమాన్’ కథ నడుస్తుంది. ఆ వాగ్దానం ఏమిటి? అందుకోసం శ్రీరాముడు, హనుమంతుడు ఏం చేశారు? అనేది ఆసక్తిదాయకం.
ఇదే పాయింట్ తో ‘హనుమాన్ని’ ముగించాడు ప్రశాంత్ వర్మ. అక్కడి నుంచే పార్ట్ 2 శ్రీకారం చుట్టుకోనుందని తెలుస్తోంది. శ్రీరాముడి పాత్ర తాలుకూ స్పాన్ని ‘జై హనుమాన్’ కోసం ప్రశాంత్ వర్మ పెంచుకొంటూ వెళ్తున్నాడని, పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని ఆకట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఈ ఎత్తుగడ వేశాడని తెలుస్తోంది. అయితే శ్రీరాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది మరో ఆసక్తికరమైన అంశం. ‘హనుమాన్’లో ఆంజనేయుడ్ని గ్రాఫిక్స్ లో చూపించాడు ప్రశాంత్ వర్మ. ఆ ఎత్తుగడ మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈసారి శ్రీరాములవారినీ అలానే గ్రాఫిక్స్లోనే చూపిస్తాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.