ప్రొ.నాగేశ్వర్ : చంద్రబాబుపై మోడీ వ్యక్తిగత విమర్శలకు కారణం ఏమిటి..?

భారతీయ జనతా పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో తాము ఒక్క టీడీపీపైనే పోరాడుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునే పదే పదే టార్గెట్ చేసుకుంటున్నారు. చివరికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… బీజేపీ కార్యకర్తలతో జరిపిన యాప్ భేటీలో చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో.. చంద్రబాబు.. రివర్స్ ఆరోపణలు ప్రారంభించారు.

బీజేపీ చోటా నేతల్లా మోడీ విమర్శలు ఎందుకున్నాయి… ?

చంద్రబాబుపై విమర్శలు చేయడానికి నరేంద్రమోడీకి అధికారం ఉంది. ఎందుకంటే.. చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ… నరేంద్రమోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. కాబట్టి.. దానికి కౌంటర్ ఇచ్చే హక్కు కూడా ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… కార్యకర్తలతో జరిగిన యాప్ భేటీలో… దానికి తగ్గట్లుగా విమర్శలు చేశారు. అందులో ప్రధానమైనవి… చంద్రబాబు కుమారుడి భవిష్యత్ కోసం.. రాష్ట్రాన్ని తాకబట్టు పెట్టారని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని చంద్రబాబు ఆత్మగౌరవాన్ని తీశారని.. అలాగే ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇలా విమర్శించడంలో తప్పు లేదు కానీ.. ఈ విమర్శల స్థాయి ప్రధాని స్థాయిలో లేదు. గల్లీ బీజేపీ లీడర్లు.. ఇలాంటి విమర్శలు చేయగలరు. ప్రధాని స్థాయిలో మాత్రం విమర్శలు లేవు.

చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలేవి..?

టీడీపీ అధినేత చంద్రబాబు… నరేంద్రమోడీపై ప్రతీ రోజూ విమర్శలు చేస్తున్నారు. అందులో చాలా కీలకంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహారాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పట్ల… కేంద్ర ప్రభుత్వం.. తీవ్ర వివక్ష చూపుతోంది. గుజరాత్‌కు నిధులు మంజూరు అయినట్లుగా.. ఏపీకి నిధులు రావడం లేదు. విభజన చట్టం అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారు. విభజన హామీలు అమలు కావాల్సి ఉన్నా.. అమలు కావడం లేదు….అనేది చంద్రబాబు ప్రధానంగా చేస్తున్న విమర్శలు. దీనికి నరేంద్రమోడీ… లెక్కలతో.. గణాంకాలతో… నిర్దిష్టమైన సమాధానం చెప్పి ఉంటే.. ఓ మంచి… చర్చకు దారి తీసి ఉండేది. అది చాలా మంచిది. కానీ… నరేంద్రమోడీ మాత్రం దిగువ స్థాయి రాజకీయ నాయకునిలా విమర్శలు చేశారు. ఇది టీడీపీ, బీజేపీ విమర్శించుకోవడానికే తప్ప… ప్రజల జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందంటే.. వ్యక్తిగత హోదాలో చంద్రబాబును ఎంతైనా విమర్శించుకోండి.. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది సగటు మనిషి ఆలోచన.

తెలుగు ప్రజల ప్రశ్నలకూ సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకున్నారా..?

నిజానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ… చంద్రబాబు వేస్తున్న ప్రశ్నలను .. ఎప్పటి నుంచో లేవనెత్తుతోంది. చంద్రబాబు .. బీజేపీతో కలసి ఉన్నప్పుడు… కూడా.. ., అనేక ప్రజాసంఘాలు విభజన హామీలపై పోరాడాయి. వాటికి సంబంధించి అయినా మోడీ సమాధానం చెప్పాల్సి ఉంది. రైల్వేజోన్ ఇంత వరకూ ఎందుకివ్వలేదు. స్టీల్ ప్లాంట్ పై ఎందుకు నాన్చుతున్నారు. దుగరాజపట్నం పోర్టు గురించి దాగుడుమూతలెందుకు..? ప్రత్యేకహోదా ఎందుకివ్వలేదు. లోటుభర్తీ, పారిశ్రామిక రాయితీలు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. ఇలా ప్రతి అంశంలోనూ… కేంద్ర ప్రభుత్వం తీరుపై.. ప్రభుత్వం నుంచే కాదు.. సివిల్ సొసైటీ నుంచి కూడా కేంద్రానికి ప్రశ్నలున్నాయి. ఎందుకు… వీటిపై.. మోడీ స్పందించలేదు. అలా స్పందించకుండా.. చంద్రబాబుపై.. ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమిటి..?

చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజలకు ఒరిగేదేమిటి..?

అలాగే చంద్రబాబు ప్రధానమంత్రి పదవి కోసం పగటి కలలు కుంటున్నారని కూడా.. మోడీ విమర్శించారు. పదవి కావాలని కోరుకోవడం తప్పేమీ కాదు. ప్రధాని అవ్వాలా వద్దా.. అని ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబుకు.. కేవలం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే గెలవగలరు. ఆ సీట్లతో ఆయన ప్రధానమంత్రి అవుతారా లేదా అన్నది పరిస్థితుల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో… చంద్రబాబు వెన్నుపోటుదారుడు అంటూ విమర్శలు చేశారు. అయితే… 2014లో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు.. అన్నీ… ప్లస్ పాయింట్లుగా.. ఆ తర్వాత మైనస్ పాయింట్లుగా కనిపిస్తాయి. అందువల్ల.. రాజకీయ విమర్శల వల్ల… ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. ఏపీ ప్రభుత్వం , ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు.. మౌలికమైన సమాధానాలు.. నరేంద్రమోడీ చెబితేనే .. ప్రజలకు ఉపయోగం. రాజకీయ విమర్శల వల్ల ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.