గెలవటం అసాధ్యమనుకున్న తెలంగాణలో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి… ఇతర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేషన్లు వస్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ ఇప్పటికే 7 రాష్ట్రాల పీసీసీలు కోరినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేరళలో పర్యటిస్తున్న రేవంత్ రెండ్రోజుల పాటు అక్కడే క్యాంపెయిన్ చేస్తున్నారు. కేరళతో పాటు ఏపీలోనూ ప్రచారం నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే యూపీ, తమిళనాడు, మహారాష్ట్రల నుండి కూడా ఇన్విటేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిని జాతీయస్థాయిలో రేవంత్ రెడ్డి పేరును స్టార్ క్యాంపెయినర్ లిస్టులో చేర్చి, అనుమతులు తీసుకుంటోంది ఏఐసీసీ.
ఇక ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ రోజుకు రెండు లోక్ సభ సీట్లలో బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించేలా ప్లానింగ్ నడుస్తోంది. మొత్తం 50 సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. రూరల్ ఏరియాల్లో భారీ బహిరంగ సభలు, పట్టణ ప్రాంతాల్లో రోడ్ షోలకు ప్రాధాన్యం ఇస్తూ రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది. తెలంగాణలో ప్రతి లోక్ సభ స్థానానికి కనీసం రెండు సార్లు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
19వ తేదీ నుండి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్నికల ప్రచారం షురూ చేయబోతున్నారు. బీఆర్ఎస్ నుండి కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో… గురువారం కేసీఆర్ రూట్ మ్యాప్ ఖరారు కాబోతుంది. దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి రూట్ మ్యాప్ ఉండబోతున్నట్లు సమాచారం.