అగ్నిమాపక శాఖ డీజీగా పని చేసినప్పుడు చేసిన అవినీతి వ్యవహారంలో నమోదైన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సీఐజీ చీఫ్ సంజయ్కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పును చూసి సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చాలా పేజీలున్న తీర్పును చూసి.. ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేస్తే.. అసుల కేసు మొత్తం విచారణ జరిపినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాలు అయిన ఇన్వాయిస్లు, ఒప్పంద పత్రాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.
సంజయ్, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్నప్పుడు, అగ్ని-ఎన్ఓసీ (AGNI-NOC) వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ అభివృద్ధి, హార్డ్వేర్ సరఫరా కోసం విజయవాడకు చెందిన సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కోసం టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, పోటీ ధరలు పొందకుండా, నిబంధనలను ఉల్లంఘించి కాంట్రాక్ట్ ఇచ్చారని కేసు నమోదు అయింది. 2023 ఫిబ్రవరి 22న, ఒప్పందం జరిగిన ఒక వారంలోనే సౌత్రిక టెక్నాలజీస్కు రూ. 59.93 లక్షలు చెల్లించారు. కానీ పనేమీ చేయలేదు.
అగ్ని యాప్ అమలు కోసం ఫైర్ సర్వీసెస్ అధికారుల కోసం 8 మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో 8 డివైస్లు, 2 ఆపిల్ ఐప్యాడ్ ప్రో డివైస్లను కొనుగోలు చేశారు. వీటిని కూడా అధిక ధరలకు సౌత్రిక టెక్నాలజీస్ నుండి కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్ల కోసం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు ఆహ్వానించకపోవడం, పోటీ కొటేషన్లు పొందకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదికలో పేర్కొన్నారు.
అలాగే సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సులు, వర్క్షాప్ల పేరుతో కృత్వ్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ. 1.19 కోట్లు చెల్లించారు. కానీ అసలు ఈ సంస్థ ఏ సదస్సులూ నిర్వహించలేదు. ఈ ఆరోపణలపై సంజయ్ను 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేసింది. అయితే సంజయ్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరైంది, కానీ ఈ కేసుపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసింది.