తెలుగుదేశం పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లేకుండా పోయారు. ఓ వైపు వైఎస్ఆర్సీపీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సేవలు పొందుతోంది. ప్రతి నియోజకవర్గలో ఓ పరిశీలకుడ్ని ధర్డ్ పార్టీ తరపున పెట్టడమే కాదు వారి రిపోర్టులకు విలువ ఇస్తోంది. ఇటీవల తెలంగాణలో కాంట్రాక్ట్ ను కేసీఆర్ అర్థాంతరంగా వదిలించుకోవడంతో ఆ టీములు కూడా ఏపీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ తరపున పని చేస్తున్న వారు మాత్రం ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు.
గతంలో రాబిన్ శర్మ అనే స్ట్రాటజిస్ట్ పని చేసేవారు. ఆయన త్వరగానే వెళ్లిపోయారు. ఆయన పొలిటికల్ స్ట్రాటజీలపై నేషనల్ లెవల్లో వర్క్ చేస్తున్నారు. ఇటీవల ఆయన తన మిత్రులతో కలిసి స్థాపించిన సంస్థ ప్రకటించిన ఓ సర్వే టీడీపీకి అనుకూలంగా ఉందని రచ్చ అయింది. నిజానికి అప్పటికే ఆయన టీడీపీకి పని చేయడం మానేశారు. ఆ తర్వాత సునీల్ కనుగోలు టీడీపీ తరపున పని చేస్తారని అనుకున్నారు. ఆయన టీం వర్క్ ప్రారంభించింది. కానీ సునీల్ కనుగోలు దృష్టి సారించలేకపోతున్నారు. ఆయనకు కాంగ్రెస్ పెద్ద బాధ్యతలు ఇచ్చింది. దీంతో ఆయన సమయం మొత్తం కాంగ్రెస్కే సరిపోతోంది.
చివరికి చంద్రబాబు కూడా కనుగోలుతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అంగీకరించారు. ఇప్పుడు స్ట్రాటజిస్ట్ టీడీపీకి లేరు. సోషల్ మీడయా నిర్వహణకు ప్రత్యేకమైన విధానాన్ని లోకేష్ ఆధ్వర్యంలో పాటిస్తున్నారు. టీడీపీకి ఎప్పుడూ స్ట్రాటజిస్టులు లేరు. చంద్రబాబే మొత్తం చూసుకునేవారు. అయితే గత ఎన్నికల్లో పరాజయం తర్వాత ప్రస్తుత రాజకీయాల్లో స్ట్రాటజిస్టుల అవసరం ఉందన్న ఒత్తిడి రావడంతో చంద్రబాబు అంగీకరించారు. కానీ సరైనోళ్లు మాత్రం దొరకడంలేదు.