హైదరాబాద్ నానక్ రాం గూడలో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో అవినీతి కోణం మరోసారి వెలుగుచూసింది. నిర్మాణ లోపం, నాసిరకం పనులు, అనుమతి లేని పనులు వగైరాలన్నీ కలిసి అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. సాక్షాత్తూ కేసీఆర్ కేబినెట్లోని మంత్రి మహేందర్ రెడ్డికి బిల్డర్ స్నేహితుడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను మంత్రి ఖండించారు. చివరకు ఇద్దరు జి హెచ్ ఎం సి అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ భవన నిర్మాణంలో అడుగడుగునా లోపాలు కనిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా, అడ్డగోలుగా ఇంత భారీ భవంతిని కట్టాలంటే తెరవెనుక బడాబాబుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ, ఆర్థిక అండదండలు అందించిన అసలైన దోషులు ఎవరనేది తేలాల్సి ఉంది.
నగరంలో అనుమతులు లేని బడా భవంతుల నిర్మాణం కొత్త కాదు. కట్టకముందే కూలిపోయి అమాయకులు బలికావడం కూడా కొత్త కాదు. ఇటీవలే జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కడుతుండగానే కూలిపోవడంతో ఇద్దరు కూలీలు మరణించారు. మీడియా ముందు హడావుడి చేసే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా అరుదు.
గతంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఇంటి పార్టీ పాలనలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటే తప్ప, ఈ అవినీతి బాగోతం అంతం కాదేమో.