కాపు కులంపై కత్తి మహేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఫిల్మ్ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ లొల్లి మ‌ళ్లీ మొద‌లైన‌ట్లే క‌నిపిస్తోంది. కొన్ని నెల‌లుగా క‌త్తికి, ప‌వ‌న్ అభిమానుల‌కు మ‌ధ్య ఓ పెద్ద యుద్ధమే న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన అధ్యక్షుడిగా ప‌వ‌న్ తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ అంశాల‌పై ఆయ‌న అభిప్రాయాల‌ను క‌త్తి మ‌హేష్ ప‌బ్లిగ్గానే విమ‌ర్శిస్తున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ అభిమానుల నుంచి ఆయ‌న‌కు పెద్ద ఎత్తున బెదిరింపులూ వ‌చ్చాయి. లైవ్ టీవీ షోల్లో, సోష‌ల్ మీడియాలో క‌త్తి మ‌హేష్‌పై దుమ్మెత్తిపోశారు ప‌వ‌న్ అభిమానులు. ఆ మ‌ధ్య ఓ టీవీ చానెల్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంటే కోడిగుడ్లతో దాడి కూడా చేశారు. అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్ అభిమానుల‌తో ఆయ‌న‌కు అవ‌గాహ‌న కుదిరింద‌ని, ఈ గొడ‌వ‌కు ఫుల్‌స్టాప్ ప‌డ్డట్లే అని అంద‌రూ భావించారు. కొన్నాళ్లుగా మ‌హేష్ కూడా ఈ వివాదాల‌కు దూరంగా ఉండ‌టంతో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు. కానీ ఆయ‌న చేసిన తాజా ట్వీట్లు.. ఈ గొడ‌వ‌కు మ‌ళ్లీ ఆజ్యం పోశాయి.

తాజాగా బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ప్రజ‌ల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమ‌వుతున్న విష‌యం తెలిసిందే క‌దా. అటు పార్టీలు కూడా దీనిపై కేంద్రాన్ని నిల‌దీస్తున్నాయి. ఇందులోభాగంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రంగంలోకి దిగి నిధుల విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వివ‌రాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌, ఉండ‌వ‌ల్ల అరుణ్‌కుమార్‌ల‌తో ప‌వ‌న్ ఓ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని కూడా వేశారు. దీనిని త‌ప్పుబ‌డుతూనే క‌త్తి మ‌హేష్ ట్వీట్ చేశారు. ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీకి మ‌ద్దతిస్తావ్‌.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు, వైసీపీ మ‌ద్దతు కావాలా.. ఏమ‌య్యా ప‌వ‌న్‌.. అంతేనా అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు కేంద్రం నో చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. దీనిపై ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

అటు అంత‌కుముందే ప‌వ‌న్ అన్న చిరంజీవిని ఉద్దేశిస్తూ క‌త్తి మ‌హేష్ మ‌రో ట్వీట్ చేశారు. కాపులు, నాయుళ్ల పిల్లల్లారా.. రాజ‌కీయంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను న‌మ్మే ముందు చిరంజీవి మీకు చేసిన మోసాన్ని మీ త‌ల్లిదండ్రుల‌ను అడిగి తెలుసుకోండి.. సినిమాల్లోనూ, రాజ‌కీయాల్లోనూ చిరంజీవి మీకు చేసిందేమీ లేదు. అస‌లైన లీడ‌ర్ ముద్రగ‌డ ప‌ద్మనాభ‌మే అంటూ క‌త్తి మ‌హేష్ ట్వీట్ చేశారు. ఆయ‌న వేసిన ఈ సూటి ప్రశ్నలు ప‌వ‌న్ అభిమానుల‌కు రుచించ‌డం లేదు. అంతా ముగిసిపోయింద‌నుకున్న స‌మ‌యంలో మ‌హేష్ చేసిన ఈ ట్వీట్లు.. మ‌రోసారి ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టేలా క‌నిపిస్తున్నాయి. ఇప్పటికే అటు నుంచి ఎదురుదాడి మొద‌లైంది. మ‌రి ఇదెంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.