పాపం శ్రీనువైట్ల.. `ఆగడు` దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోయాడు. `బ్రూస్లీ` ఫ్లాప్ అయ్యింది. `మిస్టర్` డిజాస్టర్ గా మిగిలిపోయింది. బ్రూస్లీ టైమ్లోనూ మంచి పారితోషికమే అందుకున్న శ్రీను.. `మిస్టర్` కోసం తన పారితోషికాన్ని బాగా తగ్గించుకుని, చివరికి నష్టాల్లో వాటా కూడా భరించాడు. ఓ రంగా `మిస్టర్` నుంచి ఏమీ సంపాదించుకోలేకపోయాడనే చెప్పాలి. ఇప్పుడు `అమర్ అక్బర్ ఆంటోనీ` విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాని మైత్రీమూవీస్ నిర్మించింది. కాబట్టి.. దర్శకుడిగా శ్రీనువైట్లకు మంచి పారితోషికమే గిట్టిందనుకున్నారంతా.
కానీ.. ఈ సినిమాకి సంబంధించి శ్రీనువైట్ల పారితోషికమేమీ తీసుకోలేదు. కేవలం లాభాల్లో వాటా ప్రాతిపదికన ఈ సినిమా పూర్తి చేశాడు. రూ.24 కోట్లలో సినిమా తీస్తానని చెప్పి.. ఆ ప్యాకేజీలో సినిమా పూర్తి చేయగలిగాడు. ఈ సినిమాని మైత్రీ మూవీస్ ఎవరికీ అమ్మలేదు. కానీ తెలుగు శాటిలైట్, హిందీ శాటిలైట్, అమెజాన్ ప్రైమ్, డిజిటల్ రైట్స్ రూపంలో దాదాపుగా రూ.20 కోట్ల వరకూ రాబట్టుకుంది. అంటే.. ఇంచుమించుగా పెట్టుబడి వచ్చేసినట్టే. థియేటరికల్ నుంచి వచ్చే డబ్బుల్లో సగం.. శ్రీనువైట్లకు ఇవ్వాలి. కానీ.. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం, ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో శ్రీనువైట్లకు ఈసారీ ఏమీ మిగలకుండా పోయింది. చివరికి తన సహాయ దర్శకుల జీతాల్ని కూడా శ్రీనువైట్లనే భరించినట్టు తెలుస్తోంది.