తాజాగా బిహార్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్న ప్రజాప్రతినిధుల్లో 50 శాతంమంది నేరారోపణలు ఎదుర్కుంటున్నవారే. గతంలోకంటే నూతన శాసనసభలో క్రిమినల్ కేసులున్నవారి సంఖ్య పెరిగిపోయింది. బిహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడతలుగా మొన్నీమధ్యనే పోలింగ్ పూర్తయింది. గత ఆదివారం (నవంబర్ 8) ఫలితాలు వెలువడ్డాయి. మహాకూటమి ఘనవిజయం సాధించింది.
నూతన శానససభలో 243మంది సభ్యులకు గాను, 142 మందిపై వివిధ నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. వీరిలో 98 మందిపై హత్యలు, మానభంగాలు, మతఘర్షణలకు పాల్పడటం వంటి సీరియస్ కేసులే నమోదయ్యాయి. ఈ విషయంలో ఆపార్టీ, ఈ పార్టీ అన్నతేడాలేదు. అందరిదీ ఒకటే దారి. మరి నేరగాళ్లలో రారాజు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ? జెడీ(యు) ఎమ్మెల్యే దాదన్ యాదవ్- నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయనపై 28 కేసులున్నాయి. నేరారోపణ కేసుల్లో చిక్కుకున్న ఎమ్మెల్యేల్లో 70మందిపై ఇప్పటికే ఛార్జిషీట్స్ కూడా దాఖలయ్యాయి.
ఇక కొత్తగా ఎన్నికైన గౌరవసభ్యుల ఆర్థికబలం అంచనావేస్తే, ప్రతి ముగ్గురు నూతన సభ్యుల్లో ఒకరు కోటీశ్వరుడే. 10 కోట్ల రూపాయలమేరకు ఆస్తులున్న ప్రజాప్రతినిధుల సంఖ్య 14. మొత్తం ప్రజాప్రతినిధుల సంపదను సగటున లెక్కతీస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే సంపద 3.2కోట్లుగా తేలింది. బహుసంపన్నుడైన ఎమ్మెల్యేగా జెడి(యు) పూనమ్ యాదవ్ (39కోట్లు) నిలిచారు.
ఇక పార్టీల పరంగా సగటుతీసి చూస్తే, అధిక సంపన్నలైన ప్రజాప్రతినిధులే జేడి(యు) నెంబర్ వన్ గా ఉంది. ఇక రెండవసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 80 మంది ఉంటే, సగటున వారి ఆదాయం గత ఐదేళ్లలో మూడురెట్లు పెరగడం విశేషం.
విద్యాపరంగా చూస్తే, ఈ కొత్త అసెంబ్లీలోకి అడుగిడిన ఎమ్మెల్యేల్లో 57 శాతంమంది గ్రాడ్యుయేట్స్. కొత్త ఎమ్మెల్యేల్లో 15మంది డాక్టరేట్స్ ఉండటం విశేషం. తొమ్మిది మంది మాత్రం ఏదో నామమాత్రపు చదువులతోనే చట్టసభలోకి అడుగుపెట్టినట్లు చెబుతున్నారు. వయోపరిమితి పరంగా చూస్తే, సగం మంది 50ఏళ్ల లోపువారే. అయితే, కేవలం పది శాతం మంది మాత్రమే మహిళలున్నారు.
చట్టసభల్లోకి నేరచరిత ఉన్నవాళ్లను రానివ్వమనీ, ప్రజాప్రతినిధుల పేరిట సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్నవారికి టికెట్లు ఇవ్వమనీ, సభలో ఎక్కువ శాతంమంది మహిళలు వచ్చేలా చూస్తామంటూ దాదాపుగా అన్ని పార్టీలు శ్రీరంగనీతులు వల్లించాయి. అయితే ఇవన్నీ ఎంతబూటకమో ఈ గణాంకాలు తేటతెల్లంచేస్తున్నాయి. చట్టసభల్లో నేరగాళ్ల సంఖ్య పెరిగిపోవడం పట్ల తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, స్వార్థపూరిత రాజకీయాలను మాత్రం ఏ పార్టీ వదులుకోలేదని ఈ లెక్కలు చాటిచెబుతున్నాయి.