ప్రొ.నాగేశ్వర్ : బయోపిక్‌లు ఓట్లు రాలుస్తాయా..?

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. చేరికలు, విమర్శలకు తోడు.. కొత్తగా… ఇప్పుడు సినిమాలు కూడా తీస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా… విడుదల చేస్తున్నారు. అలాగే.. యాత్ర పేరుతో వైఎస్ బయోపిక్ ను విడుదల చేశారు. అలాగే వైసీపీ లీడర్లు నిర్మాతలుగా.. వర్మ దర్శకత్వంలో మరో బయోపిక్ సిద్దం చేస్తున్నారు. మరి ఈ బయోపిక్‌లకు ఓట్లు రాలతాయా..?

బయోపిక్‌లు చూసి ప్రజలు భావోద్వేగాలకు గురవుతారా..?

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినీతారల ప్రభావం గణనీయంగా ఉంటుంది. తెలుగు ప్రజల నిత్య జీవితంలో సినిమా ఓ భాగం. అందుకే నటులకు క్రేజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ అభిమాన సంఘాలు.. యాక్టివ్‌గా ఉంటాయి. అయితే సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని అనుకున్నంత మాత్రాన.. వారు రాజకీయాల్లో విజయం సాధిస్తారనే అంచనాలు ఎప్పుడూ లేరు. తెలుగునాట ఎన్టీఆర్, తమిళనాట ఎమ్జీఆర్ మాత్రమే.. విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్లుగా మారిన ఎందరో రాజకీయాల్లో ఫెయిలయ్యారు. చిరంజీవి కూడా… సక్సెస్ కాలేకపోయారు. అలాగే.. సినిమాలు, వారి బయోపిక్‌లు ఓట్లు రాలుస్తాయా.. అంటే.. సాధ్యం కాదనే చెప్పుకోవాలి. ఎదుకంటే.. ఇలాంటి వారంతా.. ప్రజల ముందు ఉన్న వారే. వారి జీవితాలు అందరికీ తెలిసినవే. రాజకీయాల్లో విజయం సాధించాలంటే.. పరిస్థితులు కూడా కలసి రావాలి. ఎన్టీఆర్.. సినీ నటునిగా ఉన్న తన ఇమేజ్‌తోనే.. రాజకీయాల్లో విజయం సాధించలేదు. నాడు ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా.. కలసి వచ్చాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉంది. అప్పట్లో ప్రతిపక్షాలు ఏవీ బలంగా లేవు. ఆ సమయంలో.. అన్ని స్థానాలకు పోటీ చేయగలిగే స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయగలిగారు. అందుకే ప్రజలు ఆదరించారు.

రాజకీయ కోణాల్లో జీవిత చరిత్రలు స్ఫూర్తినిస్తాయా..?

సాధారణంగా బయోపిక్‌లు ఎందుకు తీస్తారంటే.. యవతకు స్ఫూర్తినివ్వడానికి తీస్తారు. కానీ ఇప్పుడు అన్ని పొలిటికల్లీ మోటీవేటెడ్ బయోపిక్‌లే తీస్తున్నారు. “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ “…అనే సినిమాను.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా… ఓ కుటుంబం చేతిలో ఉందని… ఈ బయోపిక్ ద్వారా చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. ఈ సినిమా చూస్తేనే.. ప్రజలు… సోనియా, రాహుల్ అన్యాయం చేశారని తెలుసుకున్నారా..? అంటే.. అదేమీ లేదు కదా..! ఇప్పుడు తెలుగులో వస్తున్న బయోపిక్‌ల ద్వారా తెలుస్తున్నది కూడా అదే. యాత్ర బయోపిక్ ద్వారా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కొత్తగా చెప్పేదేమి ఉంది. ఆయన పాదయాత్ర గురించి అందిరకీ తెలుసు. ఆయన సంక్షేమ పథకాల గురించీ తెలుసు. కొత్తగా చెబితే తెలుసుకోవాల్సిన పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కలిసి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత.. ఆయనకు సహజంగానే సానుభూతి వచ్చింది. అదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీకి చెంది నేతలందరూ.. జగన్మోహన్ రెడ్డిని పోటీ పడి.. తమ నేతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ హైకమాండ్ మాత్రం… జగన్‌కు చాన్సివ్వలేదు. దీంతో.. ప్రజల్లోనూ సానుభూతి పెరిగింది. అలాగని.. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ ఫ్యాక్టర్ మీదే ఉన్నారని చెప్పడానికి లేదు.

రాజకీయ ఆటలో ఇప్పుడు “బయోపిక్‌” సీజన్…!

రాష్ట్ర విభజన అంశం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధపడలేదు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా జగన్ ఉన్నారు. అందుకే.. నేతలు.. కొంత మంది ఆయన వైపు చేరారు. రాజశేఖర్ రెడ్డి పట్ల గౌరవం, అభిమానం ఉన్న ఓటర్లే కాదు… టీడీపీని వ్యతిరేకించే వారికి వేరే ఫ్లాట్ ఫాం లేదు. అందుకే.. అందరూ.. వైసీపీ వైపు చేరుతున్నారు. టీడీపీలో చోటు లేని వాళ్లు.. చంద్రబాబును వ్యతిరేకించేవాళ్లు.. టీడీపీని ఓడించాలనుకునేవాళ్లు… ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీ వద్దకు వెళ్తున్నారు. అక్కడా ప్లేస్ లేకపోతే.. జనసేనకు వెళ్తున్నారు. ఇవన్నీ కలసి వస్తున్నాయి కానీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల జగన్ నిలబడటం లేదు. అందుకే.. బయోపిక్‌ల ద్వారా… ఓట్లు వస్తాయని… ఆశపడటం లేదు. కొత్త విషయాలేమీ.. బయోపిక్‌ల ద్వారా చెప్పలేదు. ఈ సినిమాలు చూసి ప్రజలు భావోద్వేగాలకు గురై… ఓట్లు వేస్తారని చెప్పడం కష్టం. అయితే ప్రభావం ఉంటుంది. కానీ.. నిర్ణయాత్మకంగా ఉంటుందని చెప్పలేం. ఎంతో కొంత ప్రభావం ఉంటుందన్న ఆశతోనే బయోపిక్‌లు తీస్తున్నారు. తమ బ్రాండ్ అని ఏదైనా.. అనుకుంటున్నారో.. దాని పాజిటివ్ గా ప్రచారం చేసేందుకు.. తమకు వ్యతిరేకంగా.. ఉన్న వారిపై.. నిందలేసేందుకు… మరో బయోపిక్ తీస్తున్నారు. వీటిని ప్రజలు… ఆటలో ఓ భాగం అని అనుకుంటారు తప్ప.. సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.