భద్ర నుంచి సరైనోడు వరకూ బోయపాటి శ్రీను ప్రయాణం జామ్ జామ్ అంటూ హాయిగా సాగిపోయింది. మధ్యలో దమ్ము మాత్రం నిరాశ పరిచింది. సింహా, లెజెండ్, సరైనోడు చిత్రాలు కమర్షియాలిటీకి చిరునామాగా నిలిచాయి. అయితే ఒకటే లోపం… బోయపాటి మితిమీరిన యాక్షన్, హింసలతో నెట్టుకొచ్చేస్తున్నాడని, యాక్షన్ సన్నివేశాల వల్ల బోయపాటి ఫ్యామిలీ ఆడియన్స్కు దూరం అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. కేవలం యాక్షన్ సీన్స్ని, ఎమోషన్నీ మాత్రమే నమ్ముకొని బోయపాటి నెగ్గుకొస్తున్నాడని, అన్ని సినిమాలూ ఒకే గాటిన సాగుతున్నాయన్న విమర్శలొచ్చాయి. వీటిని బోయపాటి కూడా సీరియస్గానే పట్టించుకొన్నాడని టాక్. ఎలాంటి కథనైనా తీయగలనని బోయపాటి నిరూపించుకోవడానికి రంగం సిద్దం చేసుకొంటున్నాడు. అందుకు బెల్లం కొండ శ్రీనివాస్ సినిమానే ఓ వేదిక చేసుకొన్నాడని తెలుస్తోంది.
సరైనోడు తరవాత బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బోయపాటి గత సినిమాల ధోరణిలో ఉండదట. కంప్లీట్గా సరికొత్తగా ఉండబోతోందని టాక్. తీసింది బోయపాటినేనా? అనే అనుమానం వచ్చేలా ఈ సినిమాని డిజైన్ చేయబోతున్నాడట. కథ, కథని చెప్పే విధానం వీటిలో బోయపాటి ఓ సరికొత్త విధానం పాటించబోతున్నాడని, బోయపాటి సినిమాల్లోనే ఇది స్పెషల్గా కనిపించబోతోందని టాక్. ”పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు ఎలాగూ ప్రయోగాల జోలికి వెళ్లలేం. కనీసం… యువ హీరోలతో సినిమా అనే సరికి కాస్త ఒత్తిడి తగ్గుతుంది కదా, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు ప్రయోగం చేస్తాం” అని బోయపాటి చెబుతున్నాడట. కొత్తగా ఆలోచించాలి అనే ఆలోచన మంచిదే. మరి ఈ సినిమాతో బోయపాటిలోని ఎలాంటి యాంగిల్ బయటపడుతుందో చూడాలి.