ఒక అవమానం…తనను తీవ్రంగా ప్రభావితం చేసింది. అవమానం ఎదురైన చోటే తానేంటో నిరూపించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సీఐ అవమానించడంతో మరేం ఆలోచించకుండానే కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. ఎక్కడైతే చీవాట్లు ఎదుర్కొన్నాడో అక్కడే తనకు స్వాగతం పలకేలా ఉన్నత ఉద్యోగం సాధించాలనుకున్నాడు. ఐదేళ్ళుగా కష్టపడి ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్లో ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించాడు యువకుడు.
ఉదయ్ కృష్ణారెడ్డి…ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం వాసి. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఉదయ్ నానమ్మ కూరగాయలు అమ్మి అతన్ని చదివించింది. ప్రభుత్వ స్కూల్ లో విద్యనభ్యసించిన ఉదయ్.. చదువులో చురుగ్గా ఉండేవాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఏదైనా మంచి ఉద్యోగం పొంది నానమ్మకు ఆసరాగా ఉండాలనుకొని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాడు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడు, వాదోడుగా నిలిచిన ఉదయ్ ను ఓ సందర్భంలో సీఐ అవమానించాడు. అది తనను తీవ్రంగా కలిచివేసింది.
సాధారణంగా ఎవరైనా అవమానిస్తే కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నిష్క్రమిస్తారు. కానీ, ఉదయ్ అలా చేయలేదు. సీఐ కన్నా చిన్న ఉద్యోగిని అయినందుకే తనను అవమానించాడని భావించి…అంతకన్న ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు.2019లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. అవమానాలు ఎదురై, దుఃఖం మనిషిని కకావికలం చేసినప్పుడు పుట్టే ప్రతి ఆలోచన ఓ మైలురాయిగా ఉంటుంది. అందుకే సీఐ అవమానించిన వెంటనే సివిల్స్ లక్ష్యంగా చదవాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఐదేళ్ళుగా రేయింబవళ్ళు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలిచాడు ఉదయ్ కృష్ణారెడ్డి. మూడుసార్లు విఫలమైన నాలుగో ప్రయత్నంలో సివిల్స్ లో సత్తా చాటాడు. ఉదయ్ ఐఆర్ఎస్కు ఎంపికయ్యే అవకాశముంది. చిన్న అవమానం ఎదురైనా నేటి యువత మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతోంది. కానీ, ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం అవమానం పునాదిగా చేసుకొని ఎంతో ఎత్తుకు ఎదిగాడు.యువతకు స్ఫూర్తిపాఠమై నిలిచాడు. అభినందనలు ఉదయ్ కృష్ణారెడ్డి.