టాలీవుడ్లో ఐటెమ్ సాంగ్ చేసే స్టార్ కథానాయిక అనగానే తమన్నా గుర్తొస్తుంది. తమన్నా మంచి డాన్సర్ కమ్ గ్లామర్ క్వీన్ కమ్ స్టార్ కాబట్టి.. ఆమెకు ఐటెమ్ గీతాల అవకాశాలు హోరెత్తుతున్నాయి. ఒకొక్క పాటకూ రూ.50 నుంచి 70 లక్షల వరకూ తీసుకొంటోందని సమాచారం. జాగ్వార్ సినిమా కోసం ఏకంగా రూ.90 లక్షలు పారితోషికంగా అందుకొందని సమాచారం. ఈ నేపథ్యంలో తమన్నా కేవలం డబ్బుల కోసమే ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొంటోందన్న విమర్శలొస్తున్నాయి. వీటిపై తమన్నా స్పందించింది. ”ఐటెమ్ గీతాలే కాదు.. సినిమాలు కూడా నేను డబ్బుల కోసమే చేస్తాను కదా? కథానాయిగానూ, ఐటెమ్ గాళ్గానూ నేను డబ్బులు బాగానే తీసుకొంటా. అలాంటప్పుడు రెండింటినీ వేరుగా ఎందుకు చూస్తారు?” అంటూ తెలివిగా ప్రశ్నిస్తోంది తమన్నా.
”నాకు డాన్స్ అంటే ఇష్టం. నేను డాన్స్ చేస్తే చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. వాళ్లందరి కోసం, నా కోసం నేను ఐటెమ్ గీతాల్ని ఒప్పుకొంటున్నా. సౌత్ ఇండియాలో కథానాయికలు ఐటెమ్ గీతాలు చేస్తున్నారంటే చిన్న చూపు చూస్తారు. అదే బాలీవుడ్కి వెళ్లండి. అక్కడ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందా అని స్టార్ హీరోయిన్లంతా ఎదురుచూస్తుంటారు. అదృష్టం కొద్దీ నాకు ఐటెమ్ గీతాల అవకాశాలు బాగా వస్తున్నాయి. అందుకే చేస్తున్నా” అని క్లారిటీ ఇచ్చింది. డబ్బుల కోసమే ఐటెమ్ గీతాలు చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పేయడానికి కూడా గట్స్ ఉండాల్లెండి. మొత్తమ్మీద మరిన్ని ఐటెమ్ గీతాలకు తమన్నా రెడీ అన్నమాట. ఇక నిర్మాతలదే ఆలస్యం.