కథానాయకుల వెన్నంట ఉండి నడిపించేది అభిమానులే. వాళ్లే హీరోల బలం. వాళ్లే ధైర్యం. అభిమానాన్ని నిచ్చెనలుగా చేసి అందలాలు ఎక్కిన వాళ్లు, ఎక్కాలని చూస్తున్నవాళ్లు ఎంతో మంది. కేవలం థియేటర్లో రెండు గంటల పాటు వినోదాన్ని అందించినందుకు కృతజ్ఞతగా తన హీరోల కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టడానికి ముందుకొస్తారు ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ని చులకనగా చూడడం అంటే, వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడడం అంటే నిజంగా దారుణమైన విషయం. పవన్ కి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానగణాన్ని సంపాదించుకోవడంలో పవన్ తరవాతే ఏ టాలీవుడ్ హీరో అయినా. పవన్ ముందు అన్నయ్య చిరు కూడా దిగదుడుపే అనుకోవాలి. సినిమాల్లో పవన్ స్టైల్ నచ్చో, తన నిజాయతీ నచ్చో, లేదంటే ఏదో మార్పు తీసుకొస్తాడన్న భరోసాతోనో పవన్కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. వాళ్లు కూడా పవన్ పేరే మంత్రంగా జపిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే… అందులో పవన్ అభిమానుల ఉడతాభక్తి సాయం ఉందన్న విషయం ఉద్దండ రాజకీయ విశ్లేషకులు కూడా కొట్టి పారేయరు. పవన్ ఫ్యాన్స్ స్టామినా అది. అలాంటిది వాళ్లే.. ఎక్కువగా విమర్శలకు గురవుతున్నారు. పవన్ ఫ్యాన్స్ని టార్గెట్ చేసి.. మీడియా అటెన్షన్ పొందడానికి చీప్ ట్రిక్కులు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది. మొన్నటి వరకూ రాంగోపాల్ వర్మ చూపు పవన్పై, అతని ఫ్యాన్స్పై ఉండేది. ఇప్పుడు తాజాగా తమ్మారెడ్డి భరద్వాజా కూడా చేరిపోయాడు.
పవన్ అభిమానులు నిరక్షరాస్యులని వర్మ ఓ ఫాల్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ది అభిమానం కాదు, మూర్ఖత్వం అంటూ తమ్మారెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశాడు. ఓ ఛానల్ తో తమ్మారెడ్డి మాట్లాడుతూ పవన్పై అతని ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు తమ్మారెడ్డి. కంటి సైగతో పనులు జరిగే రోజులు పోయాయని, పవన్ ఆ విషయం తెలుసుకోవాలని సూచించాడు. పవన్ రోడ్డుపైకి వస్తే.. అరాచకం మొదలవుతుందని, అతని ఫ్యాన్స్ని అదుపు చేయడం కష్టమని, పవన్ ఫ్యాన్స్లో యువతరమే ఎక్కువగా ఉందని, వాళ్లతో మరీ డేంజరని చురక అంటించాడు. ప్రతీ నియోజక వర్గంలోనూ కనీసం 5 వేలమంది రోడ్లమీది కొచ్చినా పరిస్థితి చేయిదాటిపోతుందని హెచ్చరించాడు. వాళ్లది అభిమానం కాదు.. అదో టైపు మూర్ఖత్వం అనే మాట పవన్ అభిమానుల్ని హర్ట్ చేసేదే.
ప్రతీ గుంపులోనూ. ప్రతీ అభిమాన బృందంలోనూ మూర్ఖంగా, ఆవేశంగా ఆలోచించేవాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్లని చూసి అందర్నీ ఒకే గాటిన కట్టేయడం భావ్యం కాదు. పవన్ పై పడితేనో, వాళ్ల అభిమానుల్ని ఆడిపోసుకుంటేనో పబ్లిసిటీ వస్తుందనుకొంటే అది భ్రమ మాత్రమే. మొదట్లో కాస్త సీరియస్గా తీసుకొన్నా.. ఆ తరవాత అంతా లైట్ అయిపోతుంది. అలాగని పదే పదే విమర్శిస్తూ కూర్చోవడం కూడా పెద్దరికం అనిపించుకోదని కొందరి మాట. ఇదే తమ్మారెడ్డి భరద్వాజా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, అందులో పవన్ ఫ్యాన్స్ వాటా కూడా ఉందని సెలవిచ్చాడు. పవన్, చిరులు సూపర్ స్టార్లన్నీ వాళ్లతో మార్పు సాధ్యమని డబ్బా కొట్టాడు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఎందుకు మూర్ఖంగా కనిపిస్తున్నారు. తమ్మారెడ్డికైనా ఈ విషయంలో క్లారిటీ ఉందా..??